క్వారంటైన్లో ప్రాక్టీస్ లేదు..
సిడ్నీలోని ఓ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 14 రోజులు క్వారంటైన్లో ఉన్న రోహిత్ శర్మ.. ఎలాంటి జిమ్, ప్రాక్టీస్ సౌకర్యం లేకపోవడంతో చిన్న చిన్న వ్యాయామాలతో సరిపెట్టాడు. సిడ్నీలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనల్ని మళ్లీ తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ శర్మ కనీసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టుతో చేరిన రోహిత్ శర్మను మూడో టెస్టులో ఆడిస్తారా? అని హెడ్ కోచ్ రవిశాస్త్రిని ప్రశ్నించగా.. హిట్ మ్యాన్ ఫిట్నెస్ పరీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నాడు.
రోహిత్ అభిప్రాయం..
‘రోహిత్ శర్మ బుధవారం జట్టుతో చేరబోతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని ఫిజికల్ ఫిట్నెస్ను ఒకసారి పరీక్షిస్తాం. అతను 14 రోజులు క్వారంటైన్లో ఉండి నేరుగా వస్తున్నాడు. ఎలాంటి ప్రాక్టీస్ లేదు. ఈ క్రమంలో సిడ్నీ టెస్టులో ఆడటంపై అతని అభిప్రాయం తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం.'అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన రోహిత్ శర్మ.. అక్కడ ఫిట్నెస్ నిరూపించుకుని ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే.
రోహిత్ వస్తే బలయ్యేదెవరో?
ఇక రోహిత్ శర్మ జట్టులోకి వస్తే మయాంక్ అగర్వాల్, హనుమ విహారీల్లో ఒకరికి ఉద్వాసన తప్పదు. ఈ ఇద్దరు తొలి రెండు టెస్ట్ల్లో విఫలమయ్యారు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో టీమ్మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. విహారీ, మయాంక్లపై వేటు వేసి రోహిత్, రాహుల్లను తీసుకుంటుందా? లేక విన్నింగ్ టీమ్నే కొనసాగిస్తుందా? అనేది చూడాలి.
మెల్బోర్న్లో మెరిసిన భారత్..
బోర్డర్ గవాస్కర్ సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలవగా, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.