సీనియర్లు లేకున్నా..
సిరాజ్కు తోడుగా శార్దూల్ ఠాకూర్(4/61), వాషింగ్టన్ సుందర్(1/80) రాణించడంతో ఆసీస్ 294 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యం నమోదైంది. అయితే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు లేకున్నా.. సిరాజ్ పేస్ విభాగాన్ని అద్భుతంగా నడిపించాడు. యువ బౌలర్లు శార్దుల్, సైనీతో కలిసి ఆసీస్ను కట్టడి చేశాడు. దాంతో ఈ యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
తండ్రి మరణం..
అయితే సిరాజ్ ఆసీస్ టూర్లో ఉన్న సమయంలోనే అతని తండ్రి మహమ్మద్ గౌస్ (53) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ అతనికి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించినప్పటికీ సంప్రదాయ క్రికెట్ ఆడాలన్న తన తండ్రి కలను నెరవర్చేందుకు సిరాజ్ అక్కడే ఉండిపోయాడు. తన తండ్రి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. అడిలైడ్ టెస్ట్లో అవకాశం రాకున్నా.. మహ్మద్ షమీ గాయంతో మెల్బోర్న్ టెస్ట్లో చోటు దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్లోనూ సత్తా చాటాడు.
అమ్మ మాటలు..
ఇక తండ్రిని చివరిసారిగా చూడలేకపోయాననే బాధలో ఉన్న సిరాజ్కు తన తల్లి మాటలు కసిని పెంచాయని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తెలిపాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఐదు వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉందన్నాడు. 'మా నాన్న మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేను ఐదు వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉంది. కానీ మా అమ్మతో మాట్లాడిన తర్వాతే నా మనసు కుదుట పడింది. నా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నాన్న కోరికను నేరవేర్చడంపైనే దృష్టి పెట్టేలా చేసింది. ఆ ఫోన్ కాల్ మానసికంగా నన్ను దృఢం చేసింది.
మాటలు రావడం లేదు..
టెస్ట్ల్లో భారత జట్టుకు ఆడటం మా నాన్న కోరిక. అది సాకరమయ్యేలా చేసిన ఆ దేవుడికి ధన్యవాదాలు. ఈ రోజు మా నాన్న గనుకు ఉండి ఉంటే చాలా సంతోషించేవాడు. కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాకుంటాయి. ఈ ప్రదర్శనపై మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక 328 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. వర్షంతో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.