ఓపెనింగ్ జోడీ విఫలం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేనకు ఈ మ్యాచ్లో కూడా శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనింగ్ జోడీని మారుస్తూ టీమిండియా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం కూడా ఫలించలేదు. గత రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్పై వేటువేసిన టీమ్మెనేజ్మెంట్ అతని స్థానంలో శుభ్మన్ గిల్(33)కు అవకాశం కల్పించింది. కానీ అతను కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఆదిలోనే శిఖర్ ధావన్(16) వికెట్ కోల్పోగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్తో శుభ్మన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ 56 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో కుదురుకుంటుండగా.. అగర్ దెబ్బతీశాడు. గిల్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్కు చేర్చాడు.
అయ్యర్, రాహుల్ రాణించలే..
ఆ తర్వాత అయ్యర్, కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన అయ్యర్.. జంపా బౌలింగ్లో లబుషేన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పాండ్యాతో కలిసిన విరాట్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ కొద్దిసేపటికే హజల్ వుడ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరగడంతో భారత్ 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో రివ్యూకు వెళ్లిన ఆసీస్.. ఫలితం సాధించింది.
చెలరేగిన పాండ్యా, జడేజా..
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ అనంతరం చెలరేగింది. ఆసీస్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ వారికి చుక్కలు చూపించింది. తొలుత 55 బంతుల్లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేయగా.. ఆ తర్వాత 43 బంతుల్లో జడేజా అర్థ సెంచరీ సాధించాడు. అబాట్ వేసిన 48వ ఓవర్ను జడేజా చీల్చిచెండాడు. హ్యాట్రిక్ బౌండరీలతో హాఫ్ సెంచరీ అందుకున్న అతను ఆ వెంటనే మరో భారీ సిక్సర్ కొట్టి 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఓ దశలో స్వల్ప స్కోర్కే పరిమితం అవుతుందనుకున్న భారత్.. భారీ స్కోర్ చేసింది. జడేజా-పాండ్యా ధాటికి చివరి 5 ఓవర్లలో 76 పరుగులు వచ్చాయి.