ఐపీఎల్ 2026 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిద్దమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సన్నదమవుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రాక్టీస్ క్యాంప్లో ముమ్మరంగా సాధన చేస్తోంది. మరో 5 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ తెరలేవనుండటంతో అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకోంటుంది.
ఈ సన్నాహకాల్లో భాగంగా ఆదివారం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. జట్టులోని ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు కృనాల్ పాండ్యా సారథ్యం వహించగా.. మరో జట్టును వెకంటేష్ అయ్యర్ నడిపించాడు.

ఈ సన్నాహక మ్యాచ్లో జితేశ్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగాడు. 37 బంతుల్లోనే 81 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. గత సీజన్ తరహాలోనే ఈ సీజన్లోనూ ఆర్సీబీ ఫినిషర్గా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు టీమ్ డేవిడ్ 14 బంతుల్లో 36 పరుగులు చేశాడు. రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు.

ఓపెనర్గా బరిలోకి దిగిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 3 సిక్స్లతో 29 పరుగులు చేశాడు. తక్కువ పరుగులే చేసినా.. దూకుడుగా ఆడాడు. వెంకటేశ్ అయ్యర్ను మిడిలార్డర్లో ఆడించాలనే యోచనలో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు సంబంధించిన ఒక వీడియోను ఆర్సీబీ ఫ్రాంచైజీ సోమవారం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియోలో కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. 'ఇది ఒక గొప్ప ప్రాక్టీస్ మ్యాచ్. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, మంగేష్ యాదవ్ బౌలింగ్లో బాగా రాణించాడు. జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు'అని తెలిపాడు.

ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తమ తొలి టైటిల్ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ జోరును తాజా సీజన్లోనూ కొనసాగించి టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఫస్టాఫ్ షెడ్యూల్లో ఆర్సీబీ.. చిన్నస్వామి స్టేడియంలో రెండు మ్యాచ్లు ఆడనుంది. గౌహతిలో రాజస్థాన్ రాయల్స్, ముంబైలో ముంబై ఇండియన్స్తో తలపడనుంది.