మార్చి 26న ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 11వ సీజన్కు తీవ్ర భద్రతా ముప్పు ఏర్పడింది. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనుబంధ సంస్థ 'జమాత్-ఉల్-అహ్రార్' విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే చమురు సంక్షోభం, ఆటగాళ్ల గైర్హాజరీతో సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) పెద్ద తలనొప్పిగా మారింది.
జమాత్-ఉల్-అహ్రార్ విడుదల చేసిన ప్రకటనలో, లాహోర్, కరాచీలలో జరిగే పీఎస్ఎల్ మ్యాచ్ల నుంచి విదేశీ ఆటగాళ్లు వెంటనే వైదొలగాలని.. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరించింది. పాకిస్థాన్లో ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నందున అంతర్జాతీయ ప్లేయర్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేమని పేర్కొంది. హింసతో ప్రజలు అల్లాడుతుంటే క్రికెట్ నిర్వహించడం గాయాలపై కారం చల్లడమేనని ఆ సంస్థ విమర్శించింది.

ఈ బెదిరింపుల నేపథ్యంలో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. గతంలో ఆరు నగరాల్లో జరగాల్సిన మ్యాచ్లను లాహోర్, కరాచీలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రేక్షకుల ముసుగులో ఆత్మాహుతి దాడులకు అవకాశం ఉన్నందున స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని, భారీ జనసమూహాలను నివారించేందుకు ప్రారంభ వేడుకను సైతం రద్దు చేశారు.
ఉగ్ర ముప్పు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ కారణంగా చాలా మంది విదేశీ స్టార్ ప్లేయర్లు పీఎస్ఎల్ కంటే ఐపీఎల్కే ప్రాధాన్యతనిస్తున్నారు. భద్రతా కారణాలతో కొందరు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్ఎల్ కేవలం ఓ క్రీడా టోర్నీ కాకుండా, భద్రత, ఆర్థిక ఒత్తిడి, ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య వివాదాస్పద ఈవెంట్గా మారింది. ఈ సవాళ్లను అధిగమించి టోర్నీని విజయవంతంగా పూర్తి చేయడం పాక్ ప్రభుత్వానికి అత్యంత కీలకం.