ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభవార్త అందింది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్ లకు దూరమౌతాడని భావించిన ఆ జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. నేడు నేరుగా బెంగళూరుకు చేరుకోనున్నాడు. జట్టుతో కలవనున్నాడు. ఆర్సీబీతో జరిగే ఐపీఎల్ ఓపెనర్ లో అతను ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. పాట్ కమ్మిన్స్ ఆడకపోతే ముందుగా ప్రకటించినట్టుగా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్ కు కేప్టెన్ గా వ్యవహరిస్తాడు.

వెన్నునొప్పి నుంచి కమిన్స్ కోలుకున్న నేపథ్యంలో అతని రాకపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. కొత్త ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ కాలి గాయంతో టోర్నీకి దూరమవడంతో సన్రైజర్స్పై పడిన ఒత్తిడిని కమిన్స్ రాక కొంతవరకు తగ్గించినట్టయింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్ల సమావేశానికి ఇషన్ కిషన్ హాజరుకానున్నాడు. బుధవారం బెంగళూరులో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం కంటే ముందుగానే పాట్ కమ్మిన్స్ బెంగళూరుకు చేరుకున్నా కేప్టెన్ల సమావేశానికి ఇషాన్ కిషన్ పాల్గొనబోతున్నాడు.
మరోవైపు ఢిల్లీ కేపిటల్స్ ప్లేయర్ మిఛెల్ స్టార్క్ పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 11.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎడమచేతి వాటం పేసర్ ఇంతవరకు జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా అతని వర్క్ లోడ్ ను పర్యవేక్షిస్తోందని సమాచారం. ఇప్పటికీ స్టార్క్ కోసం ఎన్ఓసీ కోసం ఎదురుచూస్తోన్నామని ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ తెలిపాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతే అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడనేది తెలుస్తుందని బదానీ అన్నాడు. డీసీ డైరెక్టర్ వేణుగోపాల్ రావు కూడా స్టార్క్ రాకపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ అందిన వెంటనే స్టార్క్ జట్టుతో కలుస్తాడని పేర్కొన్నాడు.