బ్యాటర్లతో మ్యాచ్లు గెలిచినా.. బౌలింగ్ లేకుండా విజేతగా నిలవలేమని తమ మాజీ మెంటార్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటే నిజమైందని లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) ఓనర్ సంజీవ్ గోయెంకా అన్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో తమ ప్రధాన బౌలర్లు గాయపడటంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయామని చెప్పారు.
రిషభ్ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) ఏడో స్థానంలో నిలిచి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సంజీవ్ గోయెంకా.. గత ఏడాది టైటిల్ కోసం పోటీ పడేంత స్థాయిలో తమ జట్టు లేదని అంగీకరించారు. తమ తొలి సీజన్(ఐపీఎల్ 2025) సందర్భంగా గౌతమ్ గంభీర్ తనకు ఇచ్చిన ఒక సలహా గత ఏడాది నిజమైందని, అది మేనేజ్మెంట్కు ఒక కఠినమైన పాఠమని సంజీవ్ గోయెంకా తెలిపాడు.

జట్టులోని ప్రధాన పేసర్లు గాయపడటంతో బౌలింగ్ విభాగం బలహీనపడిందని ఆయన పేర్కొన్నారు. బ్యాటర్ల వ్యక్తిగత ప్రతిభతో మ్యాచ్లు గెలవవచ్చేమో కానీ, టోర్నీ గెలవలేమని ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

'నిజం చెప్పాలంటే.. గతేడాది మా జట్టు టైటిల్ గెలిచే స్థాయిలో లేదు. ఎందుకంటే మా నలుగురు ప్రధాన బౌలర్లూ గాయపడ్డారు. బ్యాటర్ల పుణ్యమా అని కొన్ని మ్యాచ్లు గెలవచ్చు కానీ, బౌలర్లు లేకుండా టోర్నీ గెలవలేరు. మా మొదటి ఏడాదిలో గౌతమ్ గంభీర్ నాకు ఇదే చెప్పాడు. గతేడాది అదే మమ్మల్ని దెబ్బతీసింది. అయితే, ఈసారి మా బ్యాటింగ్లో డెప్త్ ఉండటంతో పాటు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. మా దగ్గర అనుభవం, యువత, వేగం, నైపుణ్, స్పిన్ కలగలిసిన మంచి టీమ్ ఉంది.

సమతూకమైన జట్టు కోసం మేం చాలా ఆలోచించాం. చాలా కష్టపడ్డాం. ఆటగాళ్ల ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాం. మాకు అద్భుతమైన కోచింగ్ టీమ్, వరల్డ్ క్లాస్ ఫిజియోలు ఉన్నారు. గతంతో పోలిస్తే మేం చాలా మారాం. మెరుగుపడ్డాం. కాబట్టి ఇప్పుడు మేం చాలా నమ్మకంగా ఉన్నాం'అని సంజీవ్ గోయెంకా చెప్పుకొచ్చారు.