రహానే మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
కీలక ఆటగాళ్లు దూరమైనా.. ఘోర ఓటమి ఒత్తిడిలో ఉన్నా మెల్బోర్న్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రహానే ప్రధాన పాత్ర పోషించాడు. కెప్టెన్గా బ్యాట్స్మెన్గా రాణించి జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. అయితే వార్నర్ రాకతో ప్రత్యర్థి జట్టు కసిగా కనిపిస్తోంది. మరి, మెల్బోర్న్ వేదిక మాదిరిగానే జింక్స్ తన వ్యూహాలతో కంగారూలను కట్టడి చేస్తాడా అనేది చూడాలి. సిడ్నీ టెస్టులో రహానే జట్టును గెలిపిస్తే తన కెరీర్లో అత్యున్నత శిఖరాలు అందుకోవడంతో అరుదైన ఘనతలను సొంతం చేసుకోనున్నాడు. ఇక సిడ్నీ టెస్ట్లో భారత్ గెలవాలంటే జట్టులో కొత్తగా చేరిన రోహిత్ శర్మతో పాటు చతేశ్వర్ పుజారా చెలరేగాలి. యువ ఓపెనర్ శుభమన్ గిల్తో ఇన్నింగ్స్ ఆరంభించనున్న హిట్మ్యాన్ ఆసీస్ పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.
విహారికి లాస్ట్ చాన్స్..
గత రెండు టెస్టుల్లోనూ పుజారా తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. మయాంక్, పృథ్వీ షా వరుసగా విఫలమవ్వడంతో నయావాల్పై ఒత్తిడి పెరిగింది. అయితే రోహిత్-గిల్ మంచి ఆరంభాన్ని అందిస్తే పుజారాపై ఒత్తిడి తగ్గుతుంది. మునుపటిలా అతడు డిఫెన్స్ ఆయుధంతో ఆసీస్ పేసర్లను కట్టడిచేయగలడు. అలాగే కోహ్లీ గైర్హాజరీలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రహానే మరోసారి చెలరేగితే భారత్ పటిష్ఠ స్థితిలో నిలుస్తుంది. అయితే ఆసీస్ ముందు భారీస్కోరు ఉంచాలంటే విహారి, పంత్ కూడా రాణించాల్సి ఉంది. కేఎల్ రాహుల్ గాయంతో స్థానాన్ని కాపాడుకున్న విహారి సత్తాచాటాల్సి ఉంది.
బుమ్రాపైనే భారం..
మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో జట్టుకు దూరమవ్వడంతో పేస్ భారమంతా బుమ్రాపైనే పడింది. యువపేసర్లు సిరాజ్, సైనీకి మార్గనిర్దేశకం చేస్తూ అతడు వికెట్ల వేటను కొనసాగించాలి. మరోవైపు తొలి మ్యాచ్ ఆడుతున్న సైనీ, హైదరాబాద్ పేసర్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి సీనియర్ ఆటగాళ్లు లేని లోటును తీర్చాలి. అయితే అశ్విన్ సూపర్ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. అతడు ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్మిత్, లబుషేన్కు కొరకరాని కొయ్యలా మారాడు. అర్థం కాని బంతులు వేస్తూ ఆస్ట్రేలియాకు ప్రశ్నగా మిగిలాడు.
ఆసీస్పైనే ఒత్తిడి
డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకోకున్నా అతన్ని జట్టులోకి తీసుకువచ్చిందంటేనే ఆస్ట్రేలియాపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు. అనుభవజ్ఞుడు వార్నర్ ఉంటే జట్టు బలోపేతంగా మారుతుందని ఆసీస్ భావిస్తోంది. మరోవైపు స్మిత్ తిరిగి ఫామ్లోకి రావాలని ఎదురుచూస్తోంది. ఇటీవల సిడ్నీ వేదికగా జరిగిన వన్డేల్లో స్మిత్ వరుస శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్టులో స్మిత్ తన లయను అందుకుంటాడని ఆశిస్తోంది. ఇక ఆసీస్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్ఠంగా కనిపిస్తోంది. కొత్త బంతితో స్టార్క్, ప్యాటిన్సన్, హేజిల్వుడ్ ఎంతో ప్రభావం చూపగలరు. లైయన్ కూడా సిడ్నీ పిచ్పై సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు. బౌలింగ్ బలంగానే ఉన్నా బ్యాటింగే బలహీనంగా మారింది. స్మిత్, లబుషేన్పై అధికంగా ఆధారపడి ఉంది.
తుది జట్లు:
భారత్: అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ
ఆస్ట్రేలియా (అంచనా): డేవిడ్ వార్నర్, విల్ పకోస్కీ స్టీవ్ స్మిత్, లబుషేన్, ట్రావిస్ హెడ్, టిమ్ పైన్ (కెప్టెన్), కమిన్స్, గ్రీన్, సీన్ అబాట్, లైయన్, స్టార్క్