సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం ఆస్ట్రేలియాతో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్న భారత జట్టును ఓ చెత్త రికార్డు కలవరపెడుతోంది. సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగే తొలి వన్డేతో కోహ్లీసేన సుదీర్ఘ పర్యటన మొదలవ్వనుంది. అయితే ఈ మ్యాచ్ జరగనున్న సిడ్నీ మైదానంలో భారత్కు చెత్త రికార్డు ఉంది. ఈ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడిన భారత్ 14 మ్యాచ్ల్లో ఓడి రెండింటిలో మాత్రమే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు అచ్చిరాని గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది ఈ మైదానమే.
ఇక ఆస్ట్రేలియా అంటేనే రెచ్చిపోయే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ మైదానంలో పూర్తిగా తడబడ్డాడు. ఓవరాల్గా ఆసీస్ గడ్డపై మంచి గణంకాలను నమోదు చేసిన విరాట్ ఈ మైదానంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కంగారుల గడ్డపై వన్డేల్లో ఇప్పటి వరకు 50.17 సగటుతో 1154 రన్స్ చేసిన విరాట్.. సిడ్నీలో మాత్రం ఐదు ఇన్నింగ్స్ల్లో 9 సగటుతోనే రన్స్ చేశాడు. ఇందులో అత్యధికం 21 కావడం గమనార్హం.
ఈ గణంకాలు భారత అభిమానులను కలవరపెడుతున్నాయి. కరోనా బ్రేక్ అనంతరం జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పదా? అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ లెక్కలను భారత ఆటగాళ్లు సరిచేస్తారని, కోహ్లీసేన బోణీ కొడుతుందని మరికొందరూ అభిప్రాయపడుతున్నారు. బలం, బలగం.. తెగింపు, తెగువ.. సమాన స్థాయిలో ఉండే ఈ రెండు జట్ల పోరాటంలో ఈసారి పైచేయి ఎవరిదో? మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్లో కంగారు పెట్టేదెవరో? చూడాలి.
2018-19 సీజన్లో 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన భారత్పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా తహతలాడుతోంది. ఆ సీజన్లో వన్డే సిరీస్తోపాటు టెస్టు సిరీస్ను గెలిచిన భారత్.. 1-1తో టీ20 సిరీస్ను సమం చేసింది. సొంత గడ్డపై భారత్ చేతిలో ఒక్క సిరీస్లోనూ ఆస్ట్రేలియా గెలవకపోవడం అదే తొలిసారి.
దీంతో ఈసారి ఎలాగైనా లెక్క సరి చేయాలనే కసితో ఆస్ట్రేలియా బరిలో దిగుతోంది.
విరాట్ కోహ్లీకి బలహీనతల్లేవ్.. అతన్ని ఔట్ చేయడమే మా టార్గెట్: ఆరోన్ ఫించ్