హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మరోసారి భారత బ్యాటర్లు చెతులెత్తేసారు. దాంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా(80 బంతుల్లో 2 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. పూజా వస్త్రాకర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 30 నాటౌట్), షెఫాలీ వర్మ(42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 42) పర్వాలేదనిపించారు. స్నేహ్ రాణా(23 బంతుల్లో 2 ఫోర్లతో 27) విలువైన పరుగులు చేసింది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ మిథాలీ రాజ్(0), హర్మన్ ప్రీత్ కౌర్(14) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రితు మోని మూడు వికెట్లు తీయగా.. నహిదా అక్తర్ రెండు, జహనరా అలామ్ ఓ వికెట్ పడగొట్టింది.
తొలి వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన నహిదా అక్తెర్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. రితు మోని వేసిన మరుసటి ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో షెఫాలీ వర్మ, మిథాలీ రాజ్ ఔటయ్యారు. మిథాలీ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. దాంతో భారత్ 74 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ సమన్వయ లోపం కారణంగా హర్మన్ ప్రీత్ రనౌట్గా వెనుదిరిగింది. దాంతో 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ పరిస్తితుల్లో యస్తికా భాటియా ఫైటింగ్ ఫిఫ్టీతో జట్టును ఆదుకుంది. చివర్లో స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ విలువైన పరుగులు చేయడంతో భారత్ 200 పరుగుల మార్క్ను అందుకుంది.
ఈ మ్యాచ్కు భారత్కు ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో భారత్ రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో తప్పకుండా గెలిస్తేనే మిథాలీసేనకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్లో ఓటమి పాలవ్వడం భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఈమ్యాచ్తో పాటు సౌతాఫ్రికాతో జరిగే తదుపరి మ్యాచ్ను మెరుగైన రన్రేట్తో టీమిండియా గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.