కొలంబో: శ్రీలంకతో ఆదివారం జరగనున్న తొలి టీ20లో తమ అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతామని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. సిరీస్ గెలవడమే తమ లక్ష్యమని, గెలిచాక అవసరమైతే చివరి మ్యాచ్లో ప్రయోగాలు చేస్తామని తెలిపాడు. మూడు టీ20ల సిరీస్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన గబ్బర్.. వన్డే సిరీస్ గెలవడంతోనే చివరి వన్డేలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపాడు. టీ20 సిరీస్లో కూడా అదే రూల్ను ఫాలో అవుతామని స్పష్టం చేశాడు.
'వన్డే సిరీస్ గెలవడంతోనే చివరి వన్డేలో యువ ఆటగాళ్లను ఆడించే అవకాశం లభించింది. దాంతో ఐదుగురు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. కానీ ఇది కొత్త సిరీస్. కాబట్టి మేం అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాం. తొలి రెండు మ్యాచ్లు గెలవడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే చివరి మ్యాచ్లో ప్రయోగాలు చేస్తాం'అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.
🗣️ 🗣️: Captain @SDhawan25 exudes confidence in the #TeamIndia youngsters ahead of the #SLvIND T20I series. 👍 👍 pic.twitter.com/wjeFb3o9tR
— BCCI (@BCCI) July 24, 2021
ఇక టీ20 ప్రపంచకప్ జట్టులో తన చోటును సుస్థిరం చేసుకునేందుకు ఈ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని ధావన్ చెప్పుకొచ్చాడు. 'అంతర్జాతీయ క్రికెట్ పెర్ఫామెన్స్ ఎప్పుడూ వ్యక్తిగతంగా ప్రభావం చూపుతోంది. ఈ సిరీస్లో మంచి పెర్ఫామెన్స్తో టీ20 ప్రపంచకప్ జట్టులో నా స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవానికి ప్రయత్నిస్తున్నాను. ఏం జరుగుతుందో చూడాలి'అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.
ఇక మూడో వన్డేలో ఏకంగా ఆరు మార్పులు చేసిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మూడు వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్లో మొత్తం ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. దాంతో ఈ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లలో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి ముగ్గురికి మినహా అందరికి అవకాశం దక్కింది.
ఆదివారం జరిగే మ్యాచ్లో వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కనుండగా.. పడిక్కల్, రుతురాజ్లు కొన్నాళ్లు ఆగాల్సిందే. ఒకవేళ భారత్ వరుసగా రెండు టీ20లు గెలిస్తే వారికి కూడా అవకాశం దక్కనుంది. ఇక భారత్-శ్రీలంక మధ్య టీ20ల్లో ముఖా ముఖి పోరు చూస్తే గబ్బర్ సేనదే పై చేయిగా ఉంది. మొత్తం 19 మ్యాచ్లు జరగ్గా భారత్ 13, శ్రీలంక 5 గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.