IND vs SA: రిషభ్ పంత్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యం!

కేప్టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. అయితే మరో ఎండ్లో అతనికి సరైన సహకారం లభించకపోవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 198 పరుగులకే కుప్పకూలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 13 పరుగుల ఆధిక్యంతో సౌతాఫ్రికా ముందు భారత్ 212 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.
టీమిండియా ఇన్నింగ్స్లో పంత్ తర్వాత విరాట్ కోహ్లీ(143 బంతుల్లో 4 ఫోర్లతో 29) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. రబడా, లుంగి ఎంగిడి మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యం సౌతాఫ్రికాకు ఏం కష్టం కాదు. కానీ పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు అందిపుచ్చుకుంటే కాపాడుకోవచ్చు.
ఆదిలోనే గట్టి షాక్..
57/1 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఓవర్నైట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా(9) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. పుజారా వికెట్ కోసం సౌతాఫ్రికా భారీ స్కెచ్ వేయగా.. లెగ్ స్లిప్ ఫీల్డర్ కెగిన్ పీటర్సన్ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో పుజారా నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(1).. రబడా వేసిన ఆ మరుసటి ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. బౌన్సర్ను అంచనా వేయడంలో విఫలమైన రహానే మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో భారత్ పరుగు వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న కోహ్లీ-పంత్
ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన రిషభ్ పంత్తో కెప్టెన్ విరాట్ కోహ్లీ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఓవైపు భారత కెప్టెన్ పూర్తిగా డిఫెన్స్కు పరిమితమవ్వగా.. మరో ఎండ్లో పంత్ సహజ శైలిలో బౌండరీలు బాదాడు. సెకండ్ టెస్ట్లో నిర్లక్ష్యపు షాట్తో ఔటై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్.. తాజా ఇన్నింగ్స్లోనూ దూకుడుగా ఆడటంలో తగ్గేదేలే అంటూ ఆ తరహా షాట్స్ ఆడాడు. స్టెప్ ఔట్ అవుతూ బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే జాన్సెన్ బౌలింగ్లో క్విక్ డబుల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 43 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది.
విరాట్ వికెట్తో..
లంచ్ బ్రేక్ అనంతరం రిషభ్ పంత్ అదే దూకుడు కనబర్చాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు. మరో ఎండ్లో పరుగుల జోరు పెంచాలని భావించిన విరాట్ కోహ్లీకి లుంగి ఎంగిడి కళ్లెం వేసాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(7), శార్దూల్ ఠాకూర్(5) కూడా ఎక్కుసేపు క్రీజులో ఉండలేకపోయారు. ఇద్దరూ ఎంగిడి బౌలింగ్లోనే ఔటయ్యారు. ఇక క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీతో రిషభ్ పంత్ పోరాడాడు.
ఎక్కువగా తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ పరుగులు రాబట్టాడు. మహమ్మద్ షమీ(0) ఔటైనా.. జస్ప్రీత్ బుమ్రా సాయంతో జాన్సెన్ బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత పంత్ ఒక్క పరుగు చేయకుండానే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్ట్రైకింగ్కు వచ్చిన జస్ప్రీత్ బుమ్రాను జాన్సెన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications