జోహన్నెస్బర్గ్: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో సూపర్ బౌలింగ్తో తొలి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించిన సౌతాఫ్రికా.. రెండో రోజు అదే జోరును కనబర్చింది. ముందు స్మార్ట్గా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు ఆధిక్యాన్ని అందుకోని ఆ తర్వాత తమ పేస్ పదును చూపించింది. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కోనసాగించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో సీనియర్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా(42 బంతుల్లో 7 ఫోర్లతో 35 బ్యాటింగ్), అజింక్యా రహానే(22 బంతుల్లో ఫోర్తో 11 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(8), మయాంక్ అగర్వాల్(23) తీవ్రంగా నిరాశపరిచారు. జాన్సెన్, ఓలివర్ చెరొక వికెట్ పడగొట్టారు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫస్ట్ టెస్ట్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ క్యాచ్ ఔటవ్వగా.. 5 బౌండరీలతో జోరు కనబర్చిన మయాంక్ అగర్వాల్ను ఓలివర్ పెవిలియన్ చేర్చాడు. ఇన్ స్వింగ్ డెలివరీతో మయాంక్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ అని పొరపడి ముందే వదిలేసిన మయాంక్.. ఇన్ స్వింగ్ అవ్వడంతో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రహానేతో.. పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. తన శైలికి భిన్నంగా ధాటిగా ఆడుతూ.. వేగంగా పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఇప్పటికే అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం భారత్ 58 పరుగుల ఆధిక్యంలో ఉంది.
35/1 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్లో 79.4 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సఫారీ జట్టులో కీగన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62) టెంబా బవుమా(60 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28), కైల్ వెరీన్(72 బంతుల్లో 2 ఫోర్లతో 21), మార్కో జాన్సెన్(34 బంతుల్లో 3 ఫోర్లతో 21), కేశవ్ మహరాజ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 21) విలువైన పరుగులతో కీలక భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నారు. భారత బౌలర్లలో శార్దూల్కు అండగా మహమ్మద్ షమీ(2/52) రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(1/49) ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఇన్నింగ్స్ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు.