|
సెహ్వాగ్ తరహాలో..
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో ఆడే పృథ్వీ షా టీ20 ఫార్మాట్కు సరిగ్గా సరిపోతాడని, అతని లాంటి ఓపెనర్ లేకనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2021, 2022లో దారుణంగా విఫలమైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం పరిమిత ఓవర్ల క్రికెట్లో పృథ్వీ షాను తీసుకొని అతన్ని ప్రధాన టోర్నీలకు సిద్దం చేసుకోవాలని సూచించారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతన్ని పూర్తిగా విస్మరించడంతో.. షా దేశవాళీ క్రికెట్లో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. జట్టులోకి ఎంపిక చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు.
|
మ్యాచ్ చూసే ఉత్సాహం..
సుదీర్ఘ కాలం తర్వాత పృథ్వీ షా జట్టులోకి రావడంతో తుది జట్టులో ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. ఇషాన్ కిషన్ లేదా శుభ్మన్ గిల్తో అతను ఓపెనర్గా బరిలోకి దిగుతాడని భావించారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం రెగ్యులర్ ఓపెనర్లు అయిన ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్లకే అవకాశం ఇచ్చాడు. దాంతో పృథ్వీ షా బెంచ్కు పరిమితం కావాల్సి వచ్చింది. ఇక పృథ్వీ షా జట్టులో లేకపోవడంపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మ్యాచ్ చూసే మూడ్.. ఉత్సాహం సర్వనాశనమైందని కొందరంటే..? పృథ్వీ షా లేని ఈ మ్యాచ్ను చూడమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
|
నీ దోస్తుల కోసం..
హార్దిక్ పాండ్యా.. కెప్టెన్ అయిన తర్వాత తన స్నేహితులు, గుజరాత్ టైటాన్స్కు ఆడే ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బరోడా టీమ్కు చెందిన దీపక్ హుడా, ముంబై ఇండియన్స్ ఫ్రెండ్ అయిన ఇషాన్ కిషన్, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అయిన శుభ్మన్ గిల్, శివమ్ మావిలకు హార్దిక్ అనవసర ప్రాధాన్యత ఇస్తున్నాడని మండిపడుతున్నారు. దోస్తుల కోసం పృథ్వీ షాను బలిచేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.