రిషభ్ పంత్ వైఫల్యం..
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీ20 ఫార్మాట్లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో రెండు మ్యాచ్ల్లో విఫలమైన పంత్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చినా రాణించలేకపోయాడు. 13 బంతులాడి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దాంతో రిషభ్ పంత్ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను రాణించలేకపోతున్నాడని, టీ20 ఫార్మాట్కు సెట్ అవ్వడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అతనికి బదులు సంజూ శాంసన్ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ఓపెనర్గా ఒక్క మ్యాచ్తో పక్కనపెట్టడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అతనికి న్యూజిలాండ్తో మూడో టీ20 చివరి అవకాశం కానుంది. ఈ ఫార్మాట్లో కొనసాగాలంటే పంత్ రాణించాల్సిందే.
సూర్యపై అతిగా ఆధారపడటం..
సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్పై టీమిండియా అతిగా ఆధారపడుతుండటం అభిమానులను కలవరపెడుతోంది. రెండో టీ20లో సూర్య ఒక్కడే 111 పరుగులతో అజేయంగా నిలవగా.. మిగతా బ్యాటర్లంతా 80 పరుగులు మాత్రమే చేశారు. దాదాపు 58 శాతం పరుగులు సూర్య ఒక్కడే చేశాడు. అయితే ప్రతీసారి సూర్య రాణిస్తాడనే గ్యారంటీ లేదు. టీ20 ప్రపంచకప్లోనూ నిలకడగా రాణించిన సూర్య.. కీలక సెమీస్ పోరులో మాత్రం చేతులెత్తేసాడు. దాంతో టీమిండియా ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కాబట్టి సూర్యతో పాటు ఇతర ఆటగాళ్లు రాణించడం చాలా కీలకం.
ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి..
టీమిండియాలో ఫినిషర్ రోల్ ఎవరిదనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రెండో టీ20లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బరిలోకి దిగాడు. సూర్య విధ్వంసంతో 19 ఓవర్లకే 186/3 పరుగులు చేసిన టీమిండియా.. 200 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివరి ఓవర్లో సూర్య.. నాన్ స్ట్రైకర్ ఎండ్లో నిలిచిపోగా.. హార్దిక్ పాండ్యాతో పాటు దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ వరుసగా ఔటయ్యారు. దాంతో చివరి ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ ఓవర్లో సూర్య ఒక్క బాల్ కూడా ఆడలేకపోయాడు. కాబట్టి జట్టులో ఫినిషర్ రోల్పై క్లారిటీ అవసరం.