శుభారంభం లేదు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. జేమ్స్ అండర్సన్ ధాటికి ఓపెనర్లు శుభ్మన్ గిల్(17), చతేశ్వర్ పుజారా(13)లు క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి హనుమ విహారి, విరాట్ కోహ్లీ రాగా.. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసి నిర్ణీత సమయం కన్నా ముందుగానే లంచ్ బ్రేక్ను ప్రకటించారు. దాంతో భారత్ 20.1 ఓవర్లలో 53/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. వర్షం ఆగిపోయిన అనంతరం ఆట మళ్లీ రీస్టార్ట్ అవ్వగా.. సుమారు 40 నిమిషాలు వృథా అయ్యాయి. దాంతో ఆ సమయాన్ని అంపైర్లు పొడిగించారు.
షాకిచ్చిన మ్యాటీ
ఇక సెకండ్ సెషన్ ప్రారంభంలోనే భారత్కు గట్టి షాక్ తగిలింది. మ్యాటీ పోట్స్ తన వరుస ఓవర్లలోనే భారత్కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. క్రీజులో సెట్ అయినట్లు కనిపించిన హనుమ విహారి(20)ని వికెట్ల ముందు బోల్తా కొట్టించిన మ్యాటీ.. ఆ మరుసటి ఓవర్లోనే విరాట్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ అండర్సన్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా అయ్యర్(15) ఔటయ్యాడు. దాంతో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న పంత్, జడేజా
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. తొలుత కాస్త నిదానంగా ఆడిన ఈ ద్వయం అనంతరం జోరు పెంచింది. పంత్ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. వన్డే తరహా బ్యాటింగ్తో 51 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. పంత్ సూపర్ బ్యాటింగ్తో భారత్ 44 ఓవర్లలో 174/5 స్కోర్తో సెకండ్ సెషన్ ముగించింది.
ఆ తర్వాత మరింత ధాటిగా ఆడగా.. జడేజా అతనికి అండగా నిలుస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. ధనాధన్ షాట్లతో అలరించిన పంత్ 89 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. బ్రాడ్ వేసిన 58వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసిన పంత్.. టెస్ట్ క్రికెట్ కెరీర్లో నాలుగో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో హాఫ్ సెంచరీని 37 బంతుల్లోనే పంత్ పూర్తి చేయడం విశేషం. అదే ఓవర్లో జడేజా సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.