మిర్పూర్: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టైమ్ వృథా చేస్తున్న బంగ్లాదేశ్ బ్యాటర్పై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలు స్టంప్స్ మైక్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెండో రోజు ఆట చివర్లో ఆరో ఓవర్ సందర్భంగా బంగ్లాదేశ్ ఓపెనర్ నజ్ముల్ షాంటో టైమ్ వృథా చేశాడు.
— Guess Karo (@KuchNahiUkhada) December 23, 2022
ఓవైపు అంపైర్లు ఆటను ముగిద్దామని చూస్తుండగా.. మరోవైపు నాన్స్ట్రైకర్లో ఉన్న షాంటో షూ లేస్ కడుతూ ఆటను ఆలస్యం చేశాడు. దాంతో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ సహనం కోల్పోయి... ఆ షర్ట్ కూడా విప్పేయ్రా.. అంటూ నోరుపారేసుకున్నాడు. అయితే షాంటో ఇలా టైమ్ వృథా చేయడం ఇదే తొలిసారి కాదు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే 12వ ఆటగాడి సాయంతో బ్యాట్ మార్చుకున్నాడు. ఆ తర్వాత వాటర్ తెప్పించుకున్నాడు. ఇలా పదే పదే ఏదో వంకతో 12వ ఆటగాడిని పిలిచిన షాంటో విరాట్ ఆగ్రహానికి గురయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే షాంటో టైమ్ వృథా చేసినట్లు అర్థమైంది. వికెట్ కోల్పోకుండా రెండో రోజు ఆటను ముగించాలనే లక్ష్యంతో షాంటో ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ఇక మూడో రోజు 7/0 ఓవర్నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 219 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. బంగ్లా బ్యాటర్లలో జకీర్ హసన్(51), లిటన్ దాస్(73) మినహా అంతా విఫలమయ్యారు. క్రీజులో టస్కిన్ అహ్మద్(24 బ్యాటింగ్).. తైజుల్ ఇస్లామ్(0 బ్యాటింగ్)తో కలిసి పోరాడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 314 పరుగులకు కుప్పకూలడంతో 87 పరుగు ఆధిక్యం లభించింది. ఈ లీడ్ కలుపుకొని భారత్ ముందు ప్రస్తుతానికి 133 పరుగుల ముందంజలో బంగ్లాదేశ్ ఉంది. మరో 20 పరుగుల వ్యవధిలోనే బంగ్లాను ఆలౌట్ చేస్తే విజయలాంఛనాన్ని ఈరోజే పూర్తి చేయవచ్చు.