న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో స్లోవర్ రేటు వేసిన టీమిండియాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధిస్తూ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఒక్క ఓవర్కు చొప్పున 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తారు. బంగ్లాదేశ్తో టీమిండియా 4 ఓవర్లు తక్కువగా వేయడంతో 80 శాతం కోత విధించింది.
స్లో ఓవర్ రేటును అంగీకరించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రిఫరీకి క్షమాపణలు చెప్పడంతో పాటు మ్యాచ్ ఫీజు కోతకు అంగీకరించాడు. 'ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడం జరుగుతుంది. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే, టీమిండియా నెట్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు.'అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కష్టంగా 9 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 73) టాప్ స్కోరర్గా నిలిచి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. షకీబ్ అల్ హసన్(5/36), ఎబాదత్ హుస్సేన్ (4/47) భారత్ పతనాన్ని శాసించారు.
మెహదీ హసన్ మిరాజ్ (39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్), ముస్తాఫిజుర్ (11 బంతుల్లో 2 ఫోర్లతో 10 నాటౌట్) అద్భుతంగా పోరాడడంతో లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ జంట అభేద్యమైన ఆఖరి వికెట్కు 51 పరుగులు జోడించింది. లిటన్ దాస్ ( 63 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 41) రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ (3/32), వాషింగ్టన్ సుందర్ (2/17) రాణించారు. మెహదీ హసన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
2019లో కెప్టెన్గా బంగ్లాదేశ్పై టీ20 మ్యాచ్ ఓడిపోయిన రోహిత్ శర్మ, వన్డే మ్యాచ్లోనూ పరాజయాన్ని చవిచూశాడు. బంగ్లాదేశ్పై టీ20, వన్డేల్లో ఓటమి చవిచూసిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇరు జట్ల మధ్య బుధవారం( డిసెంబర్ 7న) రెండో వన్డే జరగనుంది.