వరల్డ్కప్ నాటి పరిస్థితులే..
ఇదే న్యూజిలాండ్తో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగులతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కూడా దాదాపు వరల్డ్కప్ సెమీస్ మ్యాచ్ నాటే పరిస్థితులే ఎదురయ్యాయి. టాపార్డర్.. మిడిలార్డర్ కట్టకట్టుకోని విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా ఒక్కడే మరోసారి కడదాక పోరాడాడు. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును టెయిలండర్ మహ్మద్ సైనీతో కలిసి జడేజా అద్భుతంగా పోరాడాడు. విజయంపై ఆశలు రేకిత్తించాడు. ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్షంగా నిలిచిన ఈ జోడీ మ్యాచ్ గెలిపించే ప్రయత్నం చేసింది.
Under-19 World Cup ఫైనల్ ప్రివ్యూ: భారత్ vs బంగ్లా గెలిచేదెవరో? యువ రాజులుగా నిలిచేదెవరో?
సూపర్ సైనీ..
ముఖ్యంగా పేసర్ సైనీ బ్యాటింగ్ ఆకట్టుకుంది. గ్రాండ్హోమ్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అనంతరం జేమీసన్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ హైలైట్గా నిలిచింది. 34 బంతుల్లో మరో 45 పరుగులు చేయాల్సిన స్థితిలో సైనీ బౌల్డ్ కావడం.. ఆ తర్వాత జడేజా భారీ షాట్కు ప్రయత్నించి ఔటవ్వడంతో భారత్ ఓడింది. సైనీ-జడేజా ఎనిమిదో వికెట్కు 80 బంతుల్లో 76 పరుగులు జత చేయడం విశేషం. అయితే జడేజా ఔటైన తీరు కూడా అభిమానులను బాధించింది. నీషమ్ బౌలింగ్లో లాంగాన్ దిశగా అతను కొట్టిన భారీ షాట్ నేరుగా ఫీల్డర్ చేతిలో పడింది. ఇది సిక్సరైతే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
|
ధోని రనౌట్తో పోల్చిన ఐసీసీ..
ఇక ఈ మ్యాచ్ వరల్డ్కప్ నాటి సెమీస్ పరిస్థితులను తలపించడంతో ఐసీసీ.. ధోని రనౌట్, జడేజా క్యాచ్ ఔట్ను పోల్చుతూ ట్వీట్ చేసింది. అప్పుడు ధోని రనౌట్, ఇప్పుడు జడేజా క్యాచ్ ఔట్ మిగతాదంతా సేమ్ టూ సేమ్ అనే అర్థం వచ్చేలా ట్వీట్లో పేర్కొంది. ‘ భారత్ -న్యూజిలాండ్ మధ్య రసవత్తకరమైన పోరు. అప్పుడు రనౌట్.. ఇప్పుడు జడేజా క్యాచ్ ఔట్.. ఇంతకు ముందే వింటే మమ్మల్ని ఆపండి 'అనే క్యాప్షన్తో ధోని రనౌట్, జడేజా క్యాచ్ ఔట్ ఫోటోలను జతచేసింది.
మరోమారు మార్టిన్ ..
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), నికోలస్ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్ (73 నాటౌట్; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు)లు రాణించగా.. బ్లండెల్ (22), జెమీసన్ (25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.
అనంతరం 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటై 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), నవదీప్ సైనీ (49 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. 6 అడుగుల 8 అంగుళాల పొడగరి, ఈ మ్యాచ్తోనే అరంగేట్రం చేసిన కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ ఆల్రౌండ్ ప్రదర్శనకుగాను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. చివరి వన్డే మంగళవారం మౌంట్ మాంగనీలో జరుగుతుంది.