న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీలోని విధ్వంసకర ఆటగాడిని నాటి సారథి సౌరవ్ గంగూలీ ముందే పసిగట్టాడని కోల్కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య తెలిపాడు. ధోనీ గొప్ప స్టార్ అవుతాడని తనతో అన్నాడని గౌరవ్ కపూర్ యూట్యూబ్ షోలో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు.
'2004లో బంగ్లాదేశ్కు వెళ్లే ఫ్లైట్లో గంగూలీ నాతో అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. ధోనీని చూపిస్తూ..'మనకు ఓ విధ్వంసకర బ్యాట్స్మన్ ఉన్నాడు. అతను భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడు.'అని దాదా చెప్పాడు. గంగూలీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. ఆటగాళ్ల ప్రతిభను పసిగట్టడం. ప్లేయర్ టాలెంట్ అతను గుర్తించాడంటే.. ఆ ఆటగాడు విఫలమైనా అతనికి అండగా ఉంటాడు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ఆటగాళ్లు రాణిస్తారని అతని గట్టి నమ్మకం'అని భట్టాచార్య చెప్పుకొచ్చాడు.
ఇక 2004 బంగ్లాదేశ్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మహీ.. ఆ టూర్లో విఫలమైనా గంగూలీ అవకాశం ఇచ్చాడు. ఆ టూర్ అనంతరం స్వదేశంలో విశాఖ తీరాన పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి మహీ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు. ఆ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన మహీ.. 148 పరుగులతో వీరవిహారం చేశాడు. ఆ తర్వాత ధోనీ విధ్వంసకర చరిత్ర తెలిసిందే.
ఇక క్లిష్టపరిస్థితుల్లో జట్టు పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ భారత క్రికెట్లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేని బలమైన జట్టుగా నిలిపాడు.
టెస్ట్ ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన స్టోక్స్.. 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ క్రికెటర్గా అరుదైన ఘనత!