హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీ) వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు. అందరూ క్రికెట్ పెద్దన్నగా పిలుస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని కూడా కనుసైగలతో బీసీసీఐ శాసిస్తోంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చెప్పిందే శాసనం. అనుకుందే తడువు అంతర్జాతీయ క్రికెట్ను ఆపేయగలదు. ఐసీసీ ఏ టోర్నీ నిర్వహించాలన్నా బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిందే.
ఇతర క్రికెట్ బోర్డులు సైతం టీమిండియాతో ఆడేందుకు ఆసక్తి చూపుతాయి. ఒక సిరీస్ ఆడితే తమ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగిపోతాయని భావిస్తాయి. అయితే 25 ఏళ్ల క్రితం బీసీసీఐ ఆర్థిక పరిస్థితి దయనీయం. కోటీ రూపాయల లోటు బడ్జెట్తో తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆటగాళ్లకు క్యాష్ రివార్డ్స్ ఇచ్చేందుకు కూడా బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు.

జట్టులోని ఆటగాళ్లకు షూ, క్రికెట్ సామగ్రిని అందించలేని దయనీయ స్థితి. అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ సాయంతోనే భారత ఆటగాళ్లు 1983 ప్రపంచకప్ ఆడేందుకు లండన్ వెళ్లారు. అసాధారణ ప్రదర్శనతో విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు క్యాష్ రివార్డ్స్ ఇచ్చేందుకు బీసీసీఐ.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్తో మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేసి ఫండ్ రైజ్ చేసింది.
ఆ కార్యక్రమంతో వచ్చిన డబ్బుల నుంచి ఆటగాళ్లకు తలో లక్ష రూపాయలను క్యాష్ రివార్డుగా అందజేసింది. ఆ తర్వాత 1987 వన్డే ప్రపంచకప్కు బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వగా రూ.7 లక్షల నష్టం వచ్చింది. 1993 వరకు బోర్టు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దాదాపు కోటీ రూపాయల లోటు బడ్జెట్లో నిలిచింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఐఎస్ బింద్రా అనే ఐఏఎస్ అధికారి బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు చేందిన జగన్మోహన్ దాల్మియా అనే మార్వాడీ వ్యాపార వేత్త బీసీసీఐకి ఆర్థిక వనరులను సృష్టించాడు. ఆ తర్వాత ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్గా బోర్డును సరైన మార్గంలోకి తీసుకెళ్లాడు.
అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు బీసీసీఐ గతిని పూర్తిగా మార్చేసింది. ఏ క్రికెట్ బోర్డుకు అయినా బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ద్వారానే ఆదాయం లభిస్తోంది. కానీ ఆ సమయంలో క్రికెట్ మ్యాచ్లను భారత్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ మాత్రమే ప్రసారం చేసేది. మ్యాచ్లు ప్రసారం చేసేందుకు బీసీసీఐనే దూరదర్శన్కు రూ. 5 లక్షలు చెల్లించేది.
ఇది బోర్డుకు తీవ్ర భారంగా మారింది. అయితే అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఆయా క్రీడల బ్రాడ్ కాస్టింగ్ హక్కులను అమ్ముకునే ప్రక్రియ మొదలైంది. దాంతో 1993లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సిరీస్ బ్రాడ్కాస్టింగ్ హక్కులను బీసీసీఐ ట్రాన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్(టీడబ్ల్యూఐ) అనే సంస్థకు రూ.3 కోట్లకు అమ్ముకుంది.

అయితే ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దూరదర్శన్ కోర్టును ఆశ్రయించింది. చాలా కాలం పాటు జరిగిన వాదోపవాదనల అనంతరం సుప్రీం కోర్టు బీసీసీఐకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్లో ఎవరైనా మ్యాచ్లు టెలికాస్ట్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ ఒక్క తీర్పుతో బీసీసీఐ దశ మారింది. తొలి ఒప్పదంతోనే ఆర్థిక సమస్యలను అధిగమించిన బీసీసీఐ రూ.1.80 లక్షల మిగులు బడ్జెట్ సాధించింది.
2000లో బ్రాడ్కాస్ట్ రైట్స్ను దూరదర్శన్ రూ.240 కోట్లకు కొనుగోలు చేసింది. 2012-2018కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ రైట్స్ను బీసీసీఐ రూ.3,851 కోట్లకు స్టార్ గ్రూప్కు అమ్ముకుంది. ఇదే స్టార్ గ్రూప్ 2018-23కు సంబంధించిన రైట్స్ను రూ. 6,138 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్తో బీసీసీఐ ఆదాయం నాలుగింతలు అయ్యింది. ఈ టోర్నీ బ్రాడ్ కాస్ట్ రైట్స్ అదనం.
ప్రస్తుతం బీసీసీఐ ప్రతీ మ్యాచ్కు సగటును రూ.40 కోట్లను వసూలు చేస్తోంది. ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్కు రూ. 55 కోట్లను స్టార్ స్పోర్ట్స్ చెల్లిస్తోంది. ఒక్క సుప్రీం తీర్పు బీసీసీఐ గతినే మార్చేసింది. గతి తప్పిన బీసీసీఐ పాలనను కూడా సుప్రీం కోర్టే సరిదిద్దడం మరో విశేషం. 2018లో బోర్డు వ్యవహారంలో జోక్యం చేసుకున్న సుప్రీం. లోథా కమిటీ వేసి బోర్డులో సంస్కరణలు తీసుకొచ్చింది.