Uber Cup 2026లో భారత మహిళల జట్టు ప్రస్థానం ముగిసింది. గ్రూప్ 'ఏ'లో భాగంగా ఏప్రిల్ 27న చైనాతో జరిగిన కీలక పోరులో భారత్ 0-5 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, వాంగ్ జీయీ మధ్య జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్ను 16-21తో కోల్పోయిన సింధు, రెండో గేమ్లో 21-19తో పుంజుకుని మ్యాచ్ను డిసైడర్ గేమ్కు తీసుకెళ్లింది. కీలకమైన మూడో గేమ్లో ఒక దశలో 18-12 ఆధిక్యంలో ఉండి విజయం దిశగా సాగిన సింధు, చివరి నిమిషంలో తడబడింది. వాంగ్ వరుసగా పాయింట్లు సాధించి 21-19తో గేమ్ను గెలవడంతో భారత్ వెనుకబడింది.

సింధు ఓటమితో మొదలైన పతనం మిగిలిన మ్యాచ్ల్లోనూ కొనసాగింది. మొదటి డబుల్స్ మ్యాచ్లో భారత జంట ప్రియ కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రాలు చైనీస్ జంట చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన సింగిల్స్లో ఇషారాణి బారువా కూడా ఓటమి పాలవ్వడంతో చైనా 3-0తో అజేయ ఆధిక్యాన్ని సాధించింది. దీంతో భారత్ టోర్నీ నుండి నిష్క్రమించడం ఖరారైంది.
నామమాత్రంగా జరిగిన మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్కు నిరాశే ఎదురైంది. రెండో డబుల్స్ మ్యాచ్లో తనిషా క్రాస్టో, కావిప్రియ సెల్వం జంట గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరి సింగిల్స్ మ్యాచ్లో దేవికా సిహాగ్ కూడా మూడు సెట్ల పోరాటం తర్వాత పరాజయం పాలైంది. ఈ ఓటమితో భారత్ 0-5తో వైట్వాష్కు గురైంది. ఒకవైపు మహిళల జట్టు నిరాశపరిచినప్పటికీ, పురుషుల జట్టు మాత్రం థామస్ కప్లో ఆస్ట్రేలియాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు చేరడం విశేషం.