ముంబై: కరోనా కట్టడికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ బాధితుల కష్టాలను చూస్తే గుండె తరుక్కుపోతుందని, తాము చేసే ఈ సాయం వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని విరుష్కజోడీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఏం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం చేస్తున్నట్లు సోమవారం ట్విటర్లో ప్రకటించింది. అయితే ఎంత సాయం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
వైద్య సహాయకురాలిగా మహిళా క్రికెటర్
అయితే ఈ స్టార్ కపుల్ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఇద్దరు కలిసి సుమారు రూ. 3 కోట్ల విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ హంగామా కథనం కూడా అనుష్క, విరాట్ రూ.3 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వారికి సన్నిహితంగా ఉన్న సినీ వ్యక్తులు తెలిపినట్లు పేర్కొంది. ఇక విరుష్క జోడీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం కోసం కాకుండా సాయం చేయాలనే విరుష్కా ఉద్దేశాన్ని కొనియాడుతున్నారు.
ఇక కరోనా వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీలు సాయం చేయాలని కోరుతూ.. పీఎం కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని పిలుపుతో చాలా మంది సెలెబ్రిటీలు తమ పెద్దమనసును చాటుకుంటున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు విరాళంగా ప్రకటించగా.. దేశ క్రీడాకారులు తమకు తోచిన సాయంచేస్తున్నారు.
బజరంగ్ పూనియా 6 నెలల జీతం ప్రకటించి ఈ విరాళల క్యాంపయిన్ మొదలుపెట్టగా.. పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ 5 లక్షల చొప్పున సాయం చేసింది. శిఖర్ ధావన్ పీఎం కేర్స్కు తన సాయాన్ని ప్రకటించగా.. సురేశ్ రైనా రూ.50 లక్షలు, రహానే 10 లక్షలు, సచిన్ రూ.50 లక్షలు, గంగూలీ 50 లక్షల విరాళాలను ప్రకటించారు. క్రికెట్ పెద్దన్న బీసీసీఐ రూ.51 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఇక ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు కూడా తమకు తోచిన సాయాన్ని చేస్తున్నాయి.