వన్డే వరల్డ్ కప్ తర్వాత...
వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం సుమారు 8 నెలలు ఆటకు దూరమైన ధోనీ.. ఎలాంటి క్రికెట్ ఆడలేదు. తొలి రెండు నెలలు ఇండియన్ ఆర్మీలో పని చేసిన ధోనీ అనంతరం ఇంటి పట్టునే ఉన్నాడు. కుటుంబ సభ్యులతో ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించాడు. ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్టేనని మాజీ క్రికెటర్లు చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ కొందరూ మాత్రం ఐపీఎల్తో ధోనీ భవితవ్యం తేలుతుందని చెప్పారు. ధోనీ కూడా సరిగ్గా ఐపీఎల్ ప్రారంభమవుతుందనగా చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్కు హాజరయ్యాడు. కానీ కరోనా అతని అందరి ఆశలను ఆడియాశలను చేసింది.
నాలుగేళ్ల క్రితమే..
అయితే ధోనీ రిటైర్మెంట్పై చర్చ జరుగుతుండటం ఇదే తొలిసారి కాదు. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరమే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వాదన వినిపించింది. ఈ టోర్నీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ధోనీని రిటైర్మెంట్పై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ధోనీ అందరికి షాకిచ్చాడు. తన శైలికి భిన్నంగా సదరు జర్నలిస్ట్ను తన పక్కన కూర్చోబెట్టుకుని అతనితో సమాధానం చెప్పించాడు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం ఇప్పుడెందుకంటే.. ఈ ఘటన జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తయింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం (2016 మార్చి 31) ఇదే రోజు వెస్టిండీస్తో జరిగిన సెమీస్లో భారత్ ఓటమిపాలైంది. అనంతరమే ఈ ఆసక్తికర ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది.
ధోనీ- జర్నలిస్ట్ నాటి సంభాషణ
జర్నలిస్ట్: ఈ టోర్నీ అనంతరం మీరు ఆటను కొనసాగించాలనుకుంటున్నారా?
ధోనీ: ఇక్కడికి రండి.. సరదాగానే అడుగుతున్న దయచేసి ఇక్కడికి రండి. (ధోనీ పిలుపుతో పక్కకు వెళ్లిన సదరు ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్)
ధోనీ: నేను రిటైర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా?
జర్నలిస్ట్: లేదు
ధోనీ: నా రన్నింగ్ ఎలా ఉంది
జర్నలిస్ట్: చాలా వేగంగా ఉంది
ధోనీ: నేను 2019 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతానని అనుకుంటున్నారా?
జర్నలిస్ట్: కచ్చితంగా ఉంటారు.
ధోనీ: నీ ప్రశ్నకు నీ దగ్గరే సమాధానం ఉంది. అనవసరమైన సమయంలో ఈ ప్రశ్నను అడిగారు.
అయితే సదరు జర్నలిస్ట్ సామ్ ఫెర్రిస్ మాత్రం ధోనీ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించిందని తన కాలమ్లో రాసుకొచ్చాడు. ఇక తాను అడిగిన ప్రశ్న సరైందేనని వాదించుకున్నాడు.