ముంబై: కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే దేశంలో నెలకొన్న పరిస్థితులు అదుపులోకి వచ్చాకే ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్సింగ్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో13వ సీజన్ను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై హర్భజన్సింగ్ తాజాగా స్టార్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానాల్లోనైనా ఐపీఎల్ నిర్వహించాలన్నాడు. 'క్రికెట్కు వీక్షకులు ఎంతో ముఖ్యం, ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఖాళీ మైదానాల్లో ఆడడానికైనా ఎలాంటి అభ్యంతరం లేదు. అలా ఆడాల్సి వస్తే ఒక ఆటగాడిగా నాకు ఉత్సాహం లభించదు.
అయితే, ప్రతీ ఒక్కరూ ఇళ్లల్లోనే ఉంటూ తప్పకుండా టీవీల్లో వీక్షించే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆటగాళ్ల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదెంతో ముఖ్యం. ఈ మెగా ఈవెంట్తో అనేక మంది జీవితాలు ఆధారపడ్డాయి. పరిస్థితులన్నీ చక్కబడ్డాకే ఐపీఎల్ను నిర్వహించాలి' అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు తాను మ్యాచ్లు ఆడలేకపోతున్నానని, ఈ సీజన్లో 17 మ్యాచ్లు (ఫైనల్తో కలిపి) ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం మైదానాన్ని సందర్శించే అవకాశం కోల్పోతున్నానని చెప్పాడు. అలాగే అభిమానులు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, తమ బస్సు వెంట చేసే బైక్ ర్యాలీలు కోల్పోతున్నట్లు బాధను వ్యక్తం చేశాడు. అభిమానులు కూడా ఇలాగే ఫీలవుతుండొచ్చని చెప్పాడు. త్వరలోనే ఐపీఎల్ జరగాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటిదాకా ఫిట్నెస్ కాపాడుకుంటానన్నాడు.
మరోవైపు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ అన్ని ప్రత్యామ్నాయ ఏర్పట్లనూ పరిశీలించే అవకాశం ఉంది. ఏప్రిల్లో నిర్వహించడం సాధ్యం కాకపోతే అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్కు ముందు ఎప్పుడైనా నిర్వహించే అవకాశం లేకపోలేదు.