మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఉంది సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ పరిస్థితి. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో ఆరంభ మ్యాచ్లకు దూరం కావడంతో ఇషాన్ కిషన్ను తాత్కలిక సారథిగా ప్రకటించారు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ పేర్కొంది. జాక్ ఎడ్వర్డ్స్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడని తెలిపింది. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో జాక్ ఎడ్వర్డ్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఎడ్వర్డ్స్ను ఐపీఎల్ 2026 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది.

ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో అతను లేని లోటును జాక్ ఎడ్వర్డ్స్ తీర్చుతాడని అంతా అనుకున్నారు. కానీ అతను కూడా గాయపడటంతో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పూర్తిగా బలహీనంగా మారింది. అయితే జాక్ ఎడ్వర్డ్స్ గాయంపై సన్రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ అతను సీజన్ మొత్తం దూరమైతే.. మరో ఆటగాడిని రిప్లేస్ చేసే అవకాశం ఉంది.
ఏది ఏమైనా సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు ఆటగాళ్ల గాయాల బెడద.. మరోవైపు ఫ్రాంచైజీ తీసుకున్న ఓ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. సన్రైజర్స్ లీడ్స్ కోసం పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ సన్రైజర్స్ ఫ్రాంచైజీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.