కోహ్లీ కెప్టెన్సీతో షాకయ్యా.. ఆర్సీబీ నమ్మకాన్ని మ్యాక్స్వెల్ నిలబెట్టాడు: గౌతం గంభీర్

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లేన్ మ్యాక్స్వెల్పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్సీబీ పెట్టిన డబ్బులకు, పెట్టుకున్న నమ్మకానికి మ్యాక్సీ తగిన న్యాయం చేశాడని కొనియాడాడు. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్వెల్(41 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముంబై ఇండియన్స్తో జరిగిన సీజన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఈ ఆసీస్ స్టార్(28 బంతుల్లో 39) ఆకట్టుకున్నాడు. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన కోహ్లీసేన.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్తానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ చానెల్తో మాట్లాడిన గంభీర్.. మ్యాక్సీ పెర్ఫామెన్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని చూసి షాకయ్యానన్నాడు.

మ్యాక్సీ సూపరో సూపర్..
'మ్యాక్స్వెల్ రాణించడం ఆర్సీబీకి చాలా ముఖ్యం. ఆ జట్టు అతని కోసం భారీ స్థాయిలో డబ్బును ఖర్చు చేసింది. అలాగే ఎంతో నమ్మకం ఉంచింది. అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
మ్యాక్సీ టోర్నీని ఆరంభించిన విధానం బాగుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫామ్నే కొనసాగిస్తున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై చాలా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్కు ప్రతికూలమైన వికెట్పై ఓపికగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ను అతను ఎదుర్కొన్న విధానం అద్భుతం. అతని బౌలింగ్లో మ్యాక్సీ చాలా తెలివిగా ఆడాడు. ఎలాంటి రిస్క్ చేయలేదు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అతను ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 'అని ఈ బీజేపీ ఎంపీ ప్రశంసించాడు.

ఏ కెప్టెన్ అలా చెప్పడు..
ఇక మ్యాక్సీని ఆకాశానికెత్తిన గౌతం గంభీర్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. కోహ్లీ తీరుతో షాక్కు గురయ్యానన్నాడు. టాస్ సమయంలో ఏ కెప్టెన్ కూడా బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాటజీలను చెప్పరని, విరాట్ మాత్రం తన వ్యూహాలను వెల్లడించాడని విమర్శించాడు. ఇక టాస్ సమయంలో విరాట్ మాట్లాడుతూ ఫస్ట్ డౌన్లో షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ వస్తాడని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను గంభీర్ తప్పుబట్టాడు. నెంబర్ 3లో ఆడే ఆటగాడు ఎవరనే విషయాన్ని ఏ కెప్టెన్ చెప్పగా తాను చూడలేదన్నాడు. కెప్టెన్స్ ఎప్పుడు ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమే చెబుతారని, కానీ ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ పేరు చెప్పరని స్పష్టం చేశాడు.

నువ్వు మగాడివిరా మ్యాక్సీ..
ఇక తిట్టిన నోటితోనే ప్రశంసలు అందుకున్న మ్యాక్స్వెల్ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. నువ్వు మగాడివిరా మ్యాక్సీ అంటు కామెంట్ చేస్తున్నారు. గత సీజన్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన మ్యాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. 13 మ్యాచుల్లో 108 పరుగులే చేశాడు. దాంతో పంజాబ్ అతన్ని వదులుకోగా.. ఈ సీజన్ వేలంలో ఆర్సీబీ రూ.14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మ్యాక్సీపై ఆర్సీబీని అంత ధర వెచ్చించడంపై చాలా విమర్శలు వచ్చాయి. గౌతం గంభీర్ అయితే ఆర్సీబీది బుద్ది తక్కువ నిర్ణయమంటు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు.

మ్యాక్సీ విఫలమవుతాడు..
ఇక సీజన్ ప్రారంభానికి ముందుకు మ్యాక్సీ ఈ సీజన్లో కూడా విఫలమవుతాడని గంభీర్ విమర్శించిన విషయం తెలిసిందే. 'ఆర్సీబీ మ్యాక్స్వెల్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. కానీ మ్యాక్స్వెల్ వారికి నిరాశను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్లో పంజాబ్ తరపున 13 మ్యాచ్లు ఆడి 108 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం దండగ. అతని వల్ల ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోనుంది. నిజానికి ఏ ఐపీఎల్ సీజన్లోనూ మ్యాక్సీ ఆశాజనకమైన ప్రదర్శన నమోదు చేయలేదు. ప్రతీ సీజన్లో అతను విఫలమవుతున్నాడు. వాస్తవానికి అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగా అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడు. అతను బాగా ఆడి ఉంటే ఇన్ని ఫ్రాంచైజీలు మారే వాడు కాదు. ఒక్క 2014 సిజన్ మినహా మ్యాక్సీ రాణించడం నేనైతే ఎప్పుడు చూడలేదు.'అని తెలిపాడు. కానీ మ్యాక్సీ తాజా ప్రదర్శనతో గంభీర్ యూటర్న్ తీసుకున్నాడు.
IPL 2021: వచ్చాడయ్యో మ్యాక్సీ.. టైటిల్ ఆశలతో పులకించిపోతుంది ఆర్సీబీ!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications