ధోనీ భవితవ్యంపై పుకార్లు ..
గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న ఈ జార్ఖండ్ డైనమైట్ మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొని అభిమానులకు ఆశలు రేకెత్తించాడు. ఇక లాక్డౌన్ వేళ ఐపీఎల్పై స్పష్టత లేకపోవడంతో ధోనీ రిటైర్మెంట్ వార్తలు కూడా వినిపించాయి. అయితే ధోనీ సతీమణి సాక్షి సింగ్ వాటిని ఖండించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిని కొంత ఘాటుగా మందలించారు.
ఏజ్ జస్ట్ నెంబర్..
ఇప్పుడు సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ నుంచి స్పష్టత రావడంతో అందరి కళ్లూ చెన్నై కెప్టెన్ మహీపైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ వయస్సు అనేది కేవలం సంఖ్యేనని, ఒక ఆటగాడు మంచి ఫామ్లో ఉన్నాడని భావిస్తే ఎప్పుడైనా ఆడొచ్చని చెప్పాడు.
‘వయసు ఒక సంఖ్య మాత్రమే. మంచి ఫామ్లో ఉండి బాగా ఆడగలననే నమ్మకం ఉన్న ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ఏన్నాళ్లైనా ఆటను కొనసాగించవచ్చు. ధోనీ కూడా మంచి ఫామ్లో ఉండి, బంతిని అద్భతంగా బాధగలననే నమ్మకంతో పాటు ఇప్పటికి 6,7 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి జట్టును గెలిపించ గలిగే శక్తి ఉందనుకుంటే నిరభ్యంతరంగా ఆటను కొనసాగించవచ్చు. ఎందుకంటే ఏ ఆటగాడని రిటైర్ తీసుకోమని బలవంతం చేయలేం. 'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ఒత్తిడి తప్పదు..
అయితే వయసు రీత్యా ధోనీపై క్రికెట్ విశ్లేషకులు ఒత్తిడి తీసుకొస్తారని చెప్పాడు. ‘చాలా మంది క్రికెట్ నిపుణులు ధోనీపై వారికున్న అంచనాల నేపథ్యంలో ఒత్తిడికి గురిచేస్తారు. ఎందుకంటే అతని వయసు పై బడటమే. అయితే క్రికెట్ ఆడాలా వద్దా? అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయమే.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీపై విమర్శలు కురిపించే గంభీర్.. నిపుణుల కారణంగా ధోనీ ఒత్తిడికి గురువుతాడని చెప్పడం విచిత్రంగా ఉందని మహీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మూడ్ మారుతుంది..
అనంతరం ఐపీఎల్పై స్పందించిన ఈ మాజీ ఓపెనర్.. అది ఎక్కడ నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యం కాదన్నాడు. ఆ మెగా టోర్నీ జరిగితే దేశ ప్రజల ఆలోచనా విధానం మారుతుందని పేర్కొన్నాడు. 13వ సీజన్ ఎక్కడ జరుగుతుందనేది అప్రస్తుతం. ముందు జరగడమే ముఖ్యం. మన ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థితి మారుతుంది. క్రికెట్ నుంచి లభించే ఊరట యావత్ భారతావని మూడ్నే మార్చేస్తుంది.
ఏ ఫ్రాంచైజీ గెలుస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరెక్కువ వికెట్లు తీస్తున్నారు అనే పట్టింపుల కన్నా... దేశ మానసిక స్థితి మారుతుంది. ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్ గతంలో జరిగిన లీగ్లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది' అని అన్నాడు.