మార్చి 7న షురూ..
ఇప్పటికే ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ కాన్సెప్ట్, జట్ల వివరాలు, షెడ్యూల్ను ఇటీవల ముంబై వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిర్వాహకులు వెల్లడించారు. ఈ అన్ అకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లతో కూడిన ఐదు టీమ్లు పోటీపడనున్నాయి. ఈ ఐదు టీమ్లకు భారత్ లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్గా నామకరణం చేశారు.
ఇక ఈ టోర్నీలో మొత్తం 110 మంది మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనుండగా.. భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు. బ్రియన్ లారా( వెస్టిండీస్), బ్రెట్లీ(ఆస్ట్రేలియాన), జాంటీ రోడ్స్( సౌతాఫ్రికా), తిలక రత్న దిల్షాన్ (శ్రీలంక) తమ దేశ టీమ్స్కు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. తొలి మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని భారత లెజెండ్స్, బ్రియాన్ లారా సారథ్యంలోని వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య మార్చి 7న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
చెప్పకుండా వెళ్లారు.. పాకిస్థాన్ చేతిలో ఓడారు.!!
12మందితో భారత జట్టు..
అయితే తాజాగా భారత లెజెండ్స్ జట్టును ప్రకటించారు. దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్లతో కూడిన 12 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. హైదరాబాద్ వెటరన్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా కూడా ఈ ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఆడనున్నాడు.
భారత్ లెజెండ్స్ : సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సమీర్ దిగ్(వికెట్ కీపర్), ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, సంజయ్ బంగర్, మునాఫ్ పటేల్, మహ్మద్ కైఫ్, ప్రజ్ఞాన్ ఓఝా, సాయిరాజ్ బహుతులే.
మొత్తం ఎన్ని మ్యాచ్లంటే..
ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్లు నిర్వహించనున్నారు. వాంఖడే మైదానంలో రెండు, ఎమ్సీఏ స్టేడియం పుణెలో 4, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మాత్రం బ్రాబౌర్న్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.
ఈ సిరీస్ ఎందుకంటే?
ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1.35 మిలియన్లు ఉండగా.. కేవలం భారత్లోనే 1,49000 ఉండటం గమనార్హం. అంతేకాకుండా దేశంలో ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. రోజుకు సరాసరిగా సుమారు 1214 మంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో సుమారు 65 లక్షల మంది దివ్యాంగులుగా మారారు.
దేశంలో క్రికెట్కు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతామనే సదుద్దేశంతో ఈ టోర్నీ జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. థానే ఆర్టీవో చీఫ్ రవిగైక్వాడ్ ఈ టోర్నీ గురించి మాట్లాడుతూ.. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మంచి కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘ఈ టోర్నమెంట్ కోసం ప్రజలు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. షెడ్యూల్, టికెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన మాజీ క్రికెటర్ల ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో మ్యాచ్లకు హాజరవుతారనుకుంటున్నా. రోడ్డు భద్రతాపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి మద్దతునిస్తారని భావిస్తున్నా. రోడ్డు భద్రతను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. భారత్లో ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. రహదారులను సురక్షితంగా మార్చేందుకు, ప్రాణాలను కాపాడటానికి మనమంతా చేతులు కలపాలి.'అని ఆయన పిలుపునిచ్చారు.
టోర్నీ షెడ్యూల్..
మార్చి 7 - భారత్ లెజెండ్స్ vs వెస్టిండీస్ లెజెండ్స్, వాంఖడే (ముంబై)
మార్చి 8 - ఆస్ట్రేలియా లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, వాంఖడే (ముంబై)
మార్చి 10 - భారత్ లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)
మార్చి 11 - వెస్టిండీస్ లెజెండ్స్ vs దక్షిణాఫ్రికా లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)
మార్చి 13 - దక్షిణాఫ్రికా లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)
మార్చి 14 - భారత్ లెజెండ్స్ vs దక్షిణాఫ్రికా, ఎంసీఏ స్టేడియం(పుణె)
మార్చి 16 - ఆస్ట్రేలియా లెజెండ్స్ vs వెస్టిండీస్ లెజెండ్స్, ఎంసీఏ స్టేడియం(పుణె)
మార్చి 17 - వెస్టిండీస్ లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, ఎంసీఏ స్టేడియం(పుణె)
మార్చి 19 - ఆస్ట్రేలియా లెజెండ్స్ vs దక్షిణాఫ్రికా లెజెండ్స్, ఎంసీఏ స్టేడియం(పుణె)
మార్చి 20 - భారత్ లెజెండ్స్ vs ఆస్ట్రేలియా లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)
మార్చి 22 - ఫైనల్