ఆస్ట్రేలియా పర్యటన కొనసాగింపు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ మెల్బోర్న్ టెస్ట్ విజయంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఇక బోర్డర్ గావస్కర్ సిరీస్లో మిగిలిన రెండు టెస్ట్లతో ఈ ఏడాదిని ప్రారంభించనుంది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్, జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్ట్ ఆడనుంది. ప్రస్తుతానికి సిరీస్లో 1-1తో సమంగా ఉన్న భారత్.. సిడ్నీటెస్ట్ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించడంతో పాటు సిరీస్లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఇంగ్లండ్కు ఆతిథ్యం..
ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో ఆడనుంది. ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య ఇరు జట్ల మధ్య నాలుగు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. ప్రస్తుతానికి అయితే మ్యాచ్ల తేదీలు ఖారారు చేయలేదు.
ఏప్రిల్లో ఐపీఎల్ 2021
ఇంగ్లండ్తో సిరీస్లు ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021కు తెరలేవనుంది. ఏప్రిల్-మే మధ్య ఈ క్యాష్ రిచ్ లీగ్ను భారత్ వేదికగానే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంది. కరోనా కారణంగా 2020 సీజన్ దుబాయ్ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే.
శ్రీలంక పర్యటన..
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లు ఆడనుంది. ఆ వెంటనే ఆసియాకప్ నేపథ్యంలో అక్కడే ఉండనుంది. రెండేళ్ల క్రితం యూఏఈ వేదికగా ఈ టోర్నీలో భారత్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. జూన్లో మొదలై జూలైలో ఈ పర్యటన ముగిసే అవకాశం ఉంది.
జింబాబ్వే టూర్..
శ్రీలంక పర్యటన అనంతరం పరిమిత ఓవర్ల కోసం జింబాబ్వేకు వెళ్లనుంది. వాస్తవానికి 2020లోనే ఈ టూర్ ఉండగా కరోనా కారణంగా వాయిదాపడింది. ఈ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు.
ఇంగ్లండ్ పర్యటన..
ఆగస్టు- సెప్టెంబర్ మధ్యలో టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఇది కొత్త సంవత్సరంలో భారత్కు బిగ్గెస్ట్ చాలెంజ్గా నిలవనుంది.
సౌతాఫ్రికాకు అతిథ్యం..
అక్టోబర్లో సౌతాఫ్రికాకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరోనా కారణంగా 2020లో రద్దయిన మూడు వన్డేల సిరీస్ను ఇరు జట్లు మళ్లీ ఆడనున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్..
సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. అక్టోబర్-నవంబర్లో ఈ మెగా టోర్నీ జరగనుంది.
న్యూజిలాండ్కు ఆతిథ్యం..
టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే నవంబర్-డిసెంబర్ మధ్య న్యూజిలాండ్తో స్వదేశంలో రెండు టెస్ట్లు, మూడు టీ20 సిరీస్లు ఆడనుంది.
సౌతాఫ్రికా పర్యటన..
ఇక ఏడాది చివర్లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టెస్ట్లు, టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ పర్యటనల తేదీలు ప్రస్తుతానికైతే ఖారారు కాలేదు. కానీ బీసీసీఐ వచ్చేఏడాది క్యాలెండర్ను ఇలా నిర్వహించేందుకు సమయాత్తం అవుతోంది. అప్పటి పరిస్థితుల కారణంగా ఈ షెడ్యూల్లో స్వల్ప లేక భారీ మార్పులు ఉండవచ్చు.