కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. 2000 సంవత్సరంలో టెస్ట్, వన్డే క్రికెట్లో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ పాక్ బ్యాట్స్మన్కు కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలిందని ఆ దేశ స్పోర్ట్స్ చానెల్ క్రికెట్ పాకిస్థాన్ పేర్కొంది. ఇక తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటూ తౌఫీక్ చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది.
ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన ఈ మహమ్మారితో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే క్రీడా టోర్నీలన్నీ రద్దు చేసి ప్రపంచమే స్వీయ నిర్భందంలోకి వెళ్లింది. అయినా ఈ వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. అయితే ఇప్పటి వరకు ఫుట్బాల్ ప్లేయర్లే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడగా.. ప్రధాన క్రికెటర్లలో మాత్రం తౌఫిక్ ఉమరే కరోనా సోకిన తొలి వ్యక్తి.
2001లో బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఉమర్... తొలి మ్యాచ్లోనే 163 బంతుల్లో 104 పరుగులతో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్లో పాక్ ఇన్నింగ్స్, 264 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇమ్రాన్ నజీర్, సల్మాన్ బట్లతో అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఈ లెఫ్టాండర్.. ఫిట్నెస్ సమస్యలతో సతమతమై జట్టుకు దూరమయ్యాడు. చివరిసారిగా 2014లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో ఆడాడు.
ఓవరాల్గా 44 టెస్ట్లు, 22 వన్డేల్లో పాక్కు ప్రాతినిథ్యం వహించిన తౌఫీక్ ఉమర్.. టెస్ట్ల్లో 7 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2963 పరుగులు చేశాడు. వన్డేల్లో మాత్రం 504 రన్సే చేశాడు. నిలకడలేమితో పాకిస్థాన్ జట్టులోకి వస్తూ పోయిన తౌఫిక్.. 2016లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్ను మాత్రం కొనసాగించాడు. తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను 2018 అక్టోబర్లో ఆడి అన్ని ఫార్మాట్ల ఆటకు గుడ్బై చెప్పాడు. 177 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఉమర్ మొత్తం 10వేల పరుగులు చేశాడు.
శాండ్విచ్ తింటుంటే బ్యాటింగ్కు వెళ్లమన్నాడు: సురేశ్ రైనా