పాపం స్మిత్..!
మూడో టెస్ట్ చివరి రోజు ఆట రెండో సెషన్లో ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్కు వెళ్లారు. అయితే ఆ సమయంలో స్మిత్ క్రీజు వద్దకు వచ్చాడు. పంత్ చేసుకున్న మార్క్ను తన షూతో చెరిపివేశాడు. ఇదంతా స్టంప్స్ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియోను క్లిప్ నెట్టింట హల్చల్ కావడంతో స్మిత్ ఉద్దేశపూర్వకంగానే పంత్ గార్డ్ చెరిపేసాడని భారత అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. పంత్ బ్యాటింగ్ను ఓర్వలేక అలా చేశాడని దుమ్మెత్తిపోశారు.
స్మిత్ తప్పులేదు..
వాస్తవానికి ఈ వ్యవహారంలో స్టీవ్ స్మిత్ది ఏ మాత్రం తప్పులేదు. అతన్ని అందరూ అపార్థం చేసుకున్నారే విషయం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. స్మిత్ చెప్పినట్లుగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పూర్తి వీడియోలో స్మిత్ కన్నా ముందే మైదాన సిబ్బంది పిచ్ను క్లీన్ చేశారు. ఆ తర్వాతే స్మిత్ షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గార్డ్ గీసుకున్నాడు. అంతే తప్పా పంత్ గార్డ్ను చెరిపేయలేదు. ఈ ఫుల్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
|
ట్రెండింగ్లో #sorrysmith
స్మిత్ను అపార్థం చేసుకున్నామని గ్రహించిన భారత అభిమానులు అతనికి భేషరతుగా క్షమాపణలు చెబుతున్నారు. #sorrysmith యాష్ ట్యాగ్తో ఆ పూర్తి వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. 'పూర్తిగా తెలుసుకోకుండా నీపై అనవసర నిందలు వేశాం. మా భారతీయుల తరఫున క్షమాపణలు'అని ఒకరంటే..'స్మిత్ పంత్ గార్డ్ చెరిపేయలేదు. చిన్న క్లిప్ చూసి అతనిపై ఓ నిర్ణయానికి రావద్దు. పూర్తి వీడియోను చూస్తే వాస్తవం ఏంటో మీకే అర్థం అవుతుంది. సారీ స్మిత్'అని మరొకరు కామెంట్ చేశారు.
|
స్మిత్ ఆవేదన..
తనపై వచ్చిన నిందలపై స్మిత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ... క్రీజులో గార్డు మార్క్ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది'అని స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక, ఈ మూడో టెస్టులో టీమిండియా గొప్పగా పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ వేదికగా జనవరి 15న ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.