అసాధారణ బ్యాటింగ్తో..
విజయం లాంఛనమనుకున్న బంగ్లాదేశ్ను వణికించాడు. అసాధారణ బ్యాటింగ్తో అజేయ హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ భారత్ను గెలిపించినంత పనిచేశాడు. కానీ రోహిత్కు మరో ఎండ్లో సహకారం లభించలేదు. మహమ్మద్ సిరాజ్ సింగిల్ తీయడానికి కూడా తడబడటంతో రోహిత్ పోరాటం వృథా అయ్యింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ సిక్స్ బాది ఆశలు రేకెత్తించిన రోహిత్.. ఆఖరి బంతిని సిక్సర్గా మలచలేకపోయాడు. ముస్తాఫిజుర్ ఈ బంతిని యార్కర్గా వేయడంతో రోహిత్ భారీ షాట్ ఆడలేకపోయాడు. యార్కర్ కాకుండా ఏ బంతి వేసినా అది సిక్సర్గా మారేది.
రోహిత్ బ్యాటింగ్కు ఫిదా..
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడినా.. సిరీస్ కోల్పోయినా.. రోహిత్ పోరాటం అభిమానులు కావాల్సిన మజా అందించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా రోహిత్ ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సిక్సర్తో మ్యాచ్ గెలిపించి ఉంటే గనుక భారత క్రికెట్ చరిత్రలో ఇది ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్గా నిలిచేది. అయితే రోహిత్ ఫినిషింగ్ స్కిల్స్కు ఫిదా అయిన అభిమానులు.. కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడటం కంటే ధోనీలా ఫినిషర్ రోల్ పోషించాలని సూచిస్తున్నారు. జట్టులో ఓపెనర్లు చాలా మంది ఉన్నారని, కానీ ఫినిషర్లే లేరని గుర్తు చేస్తున్నారు.
ఫినిషర్గా ఆడాలంటూ..
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరకలేదని, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ఫినిషర్ పాత్రకు న్యాయం చేయలేకపోయారని అభిప్రాయపడుతున్నారు. 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి.. నొప్పితో చెలరేగిన రోహిత్ను ఫినిషర్గా ఆడిస్తే మంచి ఫలితం ఉంటుందని జోస్యం చెబుతున్నారు. బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన రోహిత్ను ఫినిషర్గా ఆడించాలని, ధోనీ పాత్రను అప్పజెప్పాలని సూచిస్తున్నారు. రోహిత్ ఫినిషర్గా ఆడితే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో టీమిండియాకు తిరుగుండదని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.