టీమిండియాలో యో-యో టెస్ట్ను అటకెక్కించారా? ఒకే రోజు ముగ్గురికి గాయాలేంది?

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, రిషభ్ పంత్లు దూరమయ్యారు. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్నెస్ సమస్యలతో తొలి వన్డే ఆడలేదు. ఇక తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ పేసర్ కుల్దీప్ సేన్.. వెన్ను నొప్పితో రెండో వన్డేకు దూరమయ్యాడు. మ్యాచ్ ప్రారంభమయ్యాక క్యాచ్ పట్టే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడి మైదానం వీడగా.. స్టార్ పేసర్ దీపక్ చాహర్ మూడే ఓవర్లు బౌలింగ్ చేసి తొడ కండరాల గాయంతో బెంచ్కే పరిమితమయ్యాడు. ఇలా ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటం, ఆ గాయాలు జట్టు ఫలితాలపై ప్రభావం చూపుతుండటంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
యో యో టెస్ట్ అటకెక్కించారా?
రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆటగాళ్ల గాయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు అలసిపోతున్నారని, రొటేషన్ పాలసీని అమలు చేస్తున్నారు. సిరీస్ సిరీస్కు ఆటగాళ్లను మారుస్తూ కావాల్సిన విశ్రాంతినిస్తున్నారు. అయినా ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆగడం లేదు. ఆటగాళ్ల గాయాల అటు ఉంచి టీమ్ కాంబినేషన్ దెబ్బతిని ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. అయితే భారత ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణికంగా భావించే యో యో టెస్ట్ అటకెక్కించారా? అనే సందేహం కలుగుతోంది.

కోహ్లీ హయాంలో కఠినంగా..
టీమిండియా హెడ్ కోచ్గా రవి శాస్త్రి, కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉన్న సమయంలో ఆటగాళ్ల ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే వారు. ఎంత పెద్ద ఆటగాడైనా సరే యో యో టెస్ట్లో అర్హత సాధిస్తేనే జట్టులో అవకాశం ఇచ్చే వారు. గాయంతోనైనా.. ఇతర కారణాలతోనైనా జట్టుకు దూరమైన ఆటగాళ్లు.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే యోయో టెస్ట్ అధిగమించి రావాల్సిందే. ధోనీ హయాంలోనే ఈ పద్దతి మొదలవ్వగా.. విరాట్ కోహ్లీ కఠినంగా అమలు చేశాడు. కోహ్లీ హయాంలో ఆటగాళ్లు జట్టుకు ఎంపికైనా.. యో యో టెస్ట్లో విఫలమై జట్టుకు దూరమైన సందర్భాలున్నాయి. దాంతో ఆటగాళ్లు చాలా ఫిట్గా ఉండేవారు. దాంతో మైదానంలో చాలా చురుకుగా ఉండేవారు. ఫీల్డింగ్లో తప్పిదాలు కూడా చాలా తక్కువగా కనిపించేవి.

ద్రవిడ్ పక్కన పెట్టేసాడా?
కోహ్లీ హయాంలో యో యో టెస్ట్ అనే పదం తరుచూ వార్తల్లో వినిపించేది. కానీ రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత ఆ పదమే వినబడటం లేదు. అసలు యో యో టెస్ట్ నిర్వహిస్తున్నారా? లేదా? అనేది కూడా తెలియడం లేదు. యో యో టెస్ట్ మాట ఏమో కానీ.. కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నా.. ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. చెత్త ఫీల్డింగ్ సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకుంటున్నారు. టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం మాట్లాడిన మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో యో యో టెస్ట్ను కచ్చితంగా నిర్వహించేవాళ్లమని, దాంతో ఆటగాళ్లు ఫిట్గా ఉండి ఫీల్డింగ్లో చురుకుగా ఉండేవారని చెప్పారు.

ఫీల్డింగ్ వైఫల్యం కూడా..
అంతేకాకుంగా జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా ఒకే టీమ్ను ఆడిపించేవాళ్లమని, అది టీమ్ బాండింగ్ పెంచేదని పేర్కొన్నారు. ఇప్పుడు యో యో టెస్ట్ నిర్వహిస్తున్నారో లేదో తెలియదని, తరుచూ ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని, దాంతో ఫీల్డింగ్లో విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లను మార్చడం కూడా ఫీల్డింగ్ వైఫల్యానికి కారణమని చెప్పుకొచ్చారు. గాయంతో టీ20 ప్రపంచకప్కు దూరమైన దీపక్ చాహర్.. రీఎంట్రీలో ఆడిన మ్యాచ్ వ్యవధిలోనే మరోసారి ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిట్గా లేకున్నా దీపక్ను ఎంపిక చేశారా? అనే సందేహం కలుగుతోంది. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ సైతం మూడు రోజుల క్రితమే యో యో టెస్ట్ను అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications