ముంబై: తమ సామర్థ్యం మేరకు ఆడితే సునాయస విజయాన్నందుకునేవాళ్లమని, కానీ దురదృష్టవశాత్తు అలా చేయలేక ఓటమిపాలయ్యామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్.. వెనువెంటనే వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందన్నాడు. విరాట్ కోహ్లీ దురదృష్టం వెంటాడిందని చెప్పాడు. అతను ఈ రోజు అద్భుతమైన షాట్లు ఆడాడని, అదే జోరును కొనసాగించాలని భావించినా కలిసిరాలేదని చెప్పాడు.
'పంజాబ్ కింగ్స్ చేసిన స్కోర్ చాలా మంచిది. జానీ బెయిర్ స్టో ఆరంభంలోనే మా బౌలర్లపై విరుచుకుపడి ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే ఆ తర్వాత మేం అద్భుతంగా ఉంచుకున్నాం. ఈ వికెట్పై 200 పరుగుల లక్ష్యం అంత కష్టమేం కాదు. అయితే ఇలాంటి భారీ లక్ష్యాలను చేధించేటప్పుడు వెనువెంటనే వికెట్లు కోల్పోకూడదు. కానీ దురదృష్టవశాత్తు మేం అదే తప్పిదం చేశాం. కోహ్లీ బ్యాడ్ ఫేజ్ కొనసాగుతోంది. అతను ఎలా ఆడినా ఔటవ్వడమే జరుగుతోంది. సానుకూలంగా ఉంటూ మరింత కష్టపడితేనే ఈ ఇంటి బ్యాడ్ ఫేజ్ను ధాటగలం.
ఈ రోజు విరాట్ అద్భుతమైన షాట్స్ ఆడాడు. ఆ జోరును అలానే కొనసాగించాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. బ్యాడ్ ఫేజ్లు ఆటగాళ్లకు సహజమే. ఈ రోజు అతను దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఈ రోజును మేం వీలైనంత త్వరగా మరిచిపోయి తదుపరి మ్యాచ్కు సిద్దమవుతాం. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం పకడ్బందీ ప్రణాళికలు రెడీ చేస్తాం. నెట్స్లో శ్రమించినంత మాత్రానా గొప్ప ప్లేయర్ కాలేం. మానసికంగా ధృడంగా ఉండాలి. మా సామర్థ్యం మేరకు ఆడితే మేం ఈ మ్యాచ్లో గెలిచేవాళ్లం. మాది చాలా బలమైన టీమ్. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు.'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 70), జానీ బెయిర్ స్టో(29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 66) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. షెహ్బాజ్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్లేన్ మ్యాక్స్వెల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 35) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్కు తలో వికెట్ దక్కింది.