
సౌతాంప్టన్: కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఇంగ్లండ్-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి రోజు ఆట అనేక మలుపులు తిరుగుతోంది.
284/8 ఓవర్ నైట్ స్కోర్తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లండ్ 7.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా వెస్టిండీస్ ముందు 200 స్వల్ప లక్ష్యం నమోదైంది. ఇక ఓవర్నైట్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగిన జోఫ్రా ఆర్చర్(23), మార్క్ ఉడ్(2)లను విండీస్ బౌలర్ షెనన్ గాబ్రియెల్ ఒకే తరహాలో కీపర్గా క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో అతను తన కెరీర్లో ఆరోసారి 5 వికెట్ల హాల్ను అందుకున్నాడు.
అనంతరం 200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ విజయం సులువు అనుకున్నారంత. కానీ ఇంగ్లండ్ బౌలర్లు అనూహ్యంగా విజృంభించారు. స్వల్ప లక్ష్యాన్నైనా కాపాడుకోవచ్చనే భరోసా కలిగించారు. తొలి ఇన్నింగ్స్లో అద్భుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ ఓపెనర్లు క్రాగ్ బ్రాత్వైట్(4)ను ఆర్చర్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేసి గట్టి షాకిచ్చాడు. ఇక తన మరుసటి ఓవర్లో బ్రూక్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు. దీంతో వెస్టిండీస్ 7 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకు ముందే ఆర్చర్ వేసిన ఓ యార్కర్ బంతికి మరో ఓపెనర్ కాంప్బెల్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. నొప్పితో విలవిలలాడిన అతన్ని డాక్టర్ పరీక్షించి.. అతని బొటన వేలు విరిగినట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన షై హోప్, ఛేజ్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ మార్క్ వుడ్ అద్భుత బంతితో షై హోప్(9) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్ 27/3 స్కోర్తో లంచ్ విరామానికి వెళ్లింది. క్రీజులో ఛేజ్(12), బ్లాక్వుడ్(1) ఉన్నారు. విండీస్ విజయానికి 165 పరుగుల కావాల్సి ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.