యాసిర్ షా మాయ:
ఓవర్నైట్ స్కోరు 92/4తో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. కాసేపటికే ఒలీ పోప్ (62) వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 127 వద్ద పోప్ అయిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. వోక్స్ (19)తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ను నడిపించిన బట్లర్ (38).. యాసిర్ షా బౌలింగ్లో వెనుదిరిగాక పతనం ఊపందుకుంది. షా, షాదాబ్ కలిసి ఇంగ్లాండ్ లోయరార్డర్ను కుప్పకూల్చారు. స్టువర్ట్ బ్రాడ్ (29 నాటౌట్) పోరాడకుంటే ఇంగ్లండ్ 200 కూడా దాటేది కాదు. పాక్ బౌలర్లలో యాసిర్ షా 4 వికెట్లు పడగొట్టాడు.
చెలరేగిన బ్రాడ్, వోక్స్:
వంద పైచిలుకు ఆధిక్యం కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు తర్వాత బౌలర్లు ఆశలు కల్పించారు. రెండో ఇన్నింగ్స్లో పాక్ను తీవ్రంగా దెబ్బ కొట్టారు. పాక్ 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో షాన్ మసూద్ను డకౌట్ చేసిన బ్రాడ్.. జట్టుకు శుభారంభం అందించాడు. తర్వాత వోక్స్ (2/11) పాక్ను గట్టి దెబ్బ తీశాడు. కెప్టెన్ అజహర్ అలీ (18), స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ (5)లను ఔట్ చేశాడు. ఈ సమయంలో అసద్ షఫీక్ (29), రిజ్వాన్ (27) వికెట్ల పతనాన్ని అడ్డుకుని స్కోరును 100 దాటించారు.
పాక్ ఆధిక్యం 244:
అయితే షఫీక్, రిజ్వాన్ తక్కువ వ్యవధిలో ఔటవడంతో పాక్ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత షాబాద్ ఖాన్ (15)ను బ్రాడ్.. షాహిన్ ఆఫ్రిది (2)ని బెన్ స్టోక్స్ ఔట్ చేయడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ జట్టును బౌలింగ్లో ఆదుకున్న యాసిర్ షా.. బ్యాటింగ్లో కూడా తన వంతు కృషిచేశాడు. 12 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. మరోవైపు మొహమ్మద్ అబ్బాస్ (0) షాకు జతగా ఉన్నాడు. ఇక నసీం షా ఒక్కడే బ్యాటింగ్ చేయాల్సి ఉంది. పాక్ ప్రస్తుత ఆధిక్యం 244. ఈ వేదికలో లక్ష్యం 250 దాటినా సవాలే అని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఛేదన ఇంగ్లండ్కు అంత తేలిక కాదు. రెండో రోజు షాన్ మసూద్ బ్యాటింగ్ హైలైట్ కాగా.. మూడో రోజు మాత్రం బౌలర్లదే ఆటంతా. శనివారం మొత్తం 14 వికెట్లు పడ్డాయి.
ఆగస్టు 22న యూఏఈకి పయనం కానున్న సీఎస్కే.. ఫ్యామిలీకి నో ఛాన్స్!!