చెన్నై: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈకి వెళ్లనున్నాయని తాజాగా బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక లీగ్ కోసం 8 ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఆటగాళ్ల ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం సన్నాహాలు మొదలయ్యాయి. మరోవైపు ఐపీఎల్కు సంబంధించి ఎస్ఓపీలను ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇప్పటికే అందజేసింది.
ఐపీఎల్ లీగ్లోని చాలా జట్లు బీసీసీఐ నిర్దేశించిన ఆగస్టు 20 తర్వాత భారత్ నుంచి యూఏఈకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్టు 22న యూఏఈకి బయలుదేరాలనుకుంటునట్టు సమాచారం తెలుస్తోంది. ఆగస్టు 19న జట్టు చెన్నైలో సమావేశమవనుందట. దుబాయ్లో దిగిన తర్వాత ఆటగాళ్లను బుర్జ్ ఖలీఫా సమీపంలోని హోటల్లో ఉంచనున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఆటగాళ్లను యూఏఈకి తీసుకెళ్లడానికి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసిందట. 24 మంది ఆటగాళ్లకే బీసీసీఐ పర్మిషన్ ఇచ్చింది.
ఇక టోర్నీ ఆసాంతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని క్రికెటర్లు, కోచింగ్ స్టాఫ్ తమ కుటుంబాలకి దూరంగా ఉండనున్నారు. ఒకవేళ కుటుంబాలకి ఎంట్రీ ఇస్తే.. రిస్క్ అవుతుందని చెన్నై ఫ్రాంఛైజీ భావిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహించనుండగా.. క్రికెటర్లతో ఫ్యామిలీ మెంబర్స్ని అనుమతించడం ఫ్రాంఛైజీల ఇష్టమని బీసీసీఐ చెప్పిన విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ ఇప్పటికే తన జట్టు ఆటగాళ్లను క్వారంటైన్లో ఉంచింది. ప్రతిఒక్కరు సెపరేట్ గదులలో ఉన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు ముందుజాగ్రత్త చర్యగా కరోనా టెస్టుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. అన్ని జట్లు ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే యూఏఈలో రిసార్ట్, అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకునే పనిలో ప్రాంఛైజీలు ఉన్నాయని సమాచారం.
ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని 8ఫ్రాంఛైజీలు తమ జట్లని యూఏఈకి పంపనుండగా.. అంతకముందే క్రికెటర్లని క్వారంటైన్లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం యూఏఈకి వెళ్లిన వెంటనే ఒకసారి, క్వారంటైన్లో రెండు సార్లు. చేస్తారు. మొత్తం ఐపీఎల్ 2020 సీజన్కి ముందు ప్రతి క్రికెటర్కీ ఐదు సార్లు వైరస్ పరీక్షలు చేయనున్నారు. ఈ అన్ని పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే బయో సెక్యూర్ బబుల్లోకి చేర్చి.. టోర్నీ ముగిసే వరకూ ఎవరినీ ఆ బబుల్ వెలుపలికి అనుతించరు. టోర్నీ సాంతం ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలనుకుంటే ఈ బబుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వారు క్వారంటైన్ రూల్స్ పాటించడంతో పాటు.. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఇక వారందరికీ బబుల్ రూల్స్ వర్తిస్తాయి. ఒకవేళ బబుల్ రూల్స్ దాటితే.. మళ్లీ రీఎంట్రీ కోసం క్వారంటైన్, వైరస్ పరీక్షలు తప్పవు.
సీపీఎల్ 2020.. 162 మందికి కరోనా నెగెటివ్!!