సిడ్నీ: ఈ తరం క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మైదానంలో పరుగుల మోత మోగించే ఈ రన్ మిషన్ఎన్నో రికార్డులు తనపేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు పూర్తి చేసుకొని ఈ జాబితాలో మూడో ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ విషయాన్నే గుర్తుచేస్తూ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం క్రికెటర్లమైన తాము విరాట్ కోహ్లీని అందుకోలేకపోతున్నామని తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్లో ఈ తరానికి చెందిన ఆటగాళ్ల అంతర్జాతీయ సెంచరీలు పేర్కొన్నాడు. 'మేం కోహ్లీని అందుకోలేకపోతున్నాం అనేది నిజం' అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ప్రస్తుతమున్న క్రికెటర్లలో ఎక్కువ సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ తర్వాత వార్నర్(43) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 27 సెంచరీల వ్యత్యాసం ఉంది. కాబట్టి వార్నర్ చెప్పినట్లు ఇప్పట్లో కోహ్లీని చేరుకోవడం గానీ, అధిగమించడం గానీ అతని సహచర ఆటగాళ్లకు చాలా కష్టం.
70 సెంచరీలతో కోహ్లీ టాప్లో ఉండగా.. వార్నర్(43), క్రిస్ గేల్(42), రోహిత్ శర్మ(40), రాస్ టేలర్(40), స్టీవ్ స్మిత్(38), కేన్ విలియమ్సన్(37), జోరూట్(36), శిఖర్ ధావన్(24), డూప్లెసిస్ 23 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం కోహ్లీ యూకే పర్యటనకు వెళ్లనున్నాడు.
దాదాపు రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్.. ఈ పర్యటనలో ఆ కరువును తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది. 2019లో బంగ్లాదేశ్తో జరిగిన ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్ట్లో చివరిసారిగా సెంచరీ చేసిన విరాట్.. ఆ తర్వాత మళ్లీ శతకం బాదలేకపోయాడు. హాఫ్ సెంచరీలతో పరుగులు చేసినా.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు.