అహ్మదాబాద్: ఫ్లడ్లైట్ల వెలుతురులో ఎస్జీ పింక్బాల్ ఎంతమేరకు స్వింగ్ అవుతుందో అంచనా వేయడం కష్టమని టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ఈ నెల 24 నుంచి మొతెరా స్టేడియంలో ఇంగ్లండ్తో పింక్ బాల్ టెస్ట్ నేపథ్యంలో అతను శనివారం మీడియాతో మాట్లాడాడు. 'సాధారణంగా సాయంత్రం వేళ పింక్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతోంది. కానీ డేనైట్లో బాల్ ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మాకు పింక్ టెస్ట్లు ఆడిన అనుభవం ఎక్కువ లేదు.
ఇప్పటివరకు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాం. రెడ్బాల్తో మ్యాచ్ డిఫరెంట్గా ఉంటుంది. మ్యాచ్కు ముందు పింక్ బాల్ గురించి ఏం చెప్పలేం. కొన్నిసార్లు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అది జరగదు. అందుకే ముందుగా ఏదీ ఊహించడం లేదు. మ్యాచ్ ప్రోగ్రెస్ను బట్టి నిర్ణయాలు ఉంటాయి'అని చెప్పాడు.
ఐపీఎల్లో ఏడేళ్ల విరామం తర్వాత చతేశ్వర్ పుజారాకు అవకాశం లభించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తగినన్ని మ్యాచ్లు లభించే అవకాశం లేదు కాబట్టి ఐపీఎల్ జరిగే సమయంలో అతను ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడితేనే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. దీనిపై పుజారా స్పందించాడు. లీగ్ తర్వాత కూడా ఇంగ్లండ్ గడ్డపై జరగబోయే సిరీస్కు తమ వద్ద తగినంత సమయం ఉంటుదని అతను అన్నాడు. 'ఐపీఎల్లో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది.
నన్ను ఎంచుకున్న చెన్నైకి కృతజ్ఞతలు. అయితే ముందుగా ఐపీఎల్పైనే దృష్టి పెడతా. అది ముగిసిన తర్వాతే మరోదాని గురించి ఆలోచిస్తా. నాకు తెలిసి ఇంగ్లండ్తో ఆ దేశంలో జరిగే సిరీస్కు ముందు కచ్చితంగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు సమయం లభిస్తుంది. అది నాకు సరిపోతుంది' అని పుజారా స్పష్టం చేశాడు.