బంగ్లాదేశ్తో ఓటమి.. బీసీసీఐ ఆగ్రహం! రోహిత్, ద్రవిడ్, కోహ్లీతో అత్యవసర సమావేశం!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వైఫల్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో భారత ప్రధాన జట్టు ఓడుతుందని తాము అస్సలు ఊహించలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమితో పాటు బంగ్లాదేశ్తో తాజా పరాజయంపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ సమావేశం పాల్గొననున్నట్లు సమాచారం.

ఆఫిస్ బేరర్లు బిజీగా ఉండటంతో..
టీ20 ప్రపంచకప్ అనంతరమే ఈ సమావేశం ఉంటుందని ప్రచారం జరిగినా.. బీసీసీఐ ఆఫిస్ బేరర్లు బిజీగా ఉండటంతో కుదరలేదని, కానీ బంగ్లాదేశ్తో ఓటమితో అత్యవసరంగా సమావేశమవ్వడం ముఖ్యమని భావించిందని ఓ అధికారి పేర్కొన్నారు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు ఏడాది కూడా సమయం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పసికూన బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడటం బోర్డు అధికారులను ఆందోళనకు గురి చేస్తోందని సదరు అధికారి తెలిపారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించాల్సిన అవసరం ఉందని బోర్డు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

బంగ్లా చేతిలో ఓటమిని..
'కొందరు బీసీసీఐ ఆఫిస్ బేరర్లు బిజీగా ఉండటంతో బంగ్లాదేశ్ పర్యటనకు ముందు రివ్యూ మీటింగ్ నిర్వహించలేకపోయాం. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం ఈ సమావేశం నిర్వహించాలనుకున్నాం. కానీ బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఇంత చెత్తగా ఆడి ఓటమి పాలవుతుందని అస్సలు ఊహించలేకపోయాం.'అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

స్ల్పిట్ కెప్టెన్సీపై తుది నిర్ణయం..
టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. టీమిండియా కూడా సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిదారిపట్టింది. దాంతో మరోసారి ఐసీసీ టైటిల్ లేకుండానే టీమిండియా వెనుదిరిగింది. ఈ పరాజయంతో భారత క్రికెట్లో స్ప్లిట్ కెప్టెన్సీ విధానాన్ని అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్ శర్మను వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు పరిమితం చేసి హార్దిక్ పాండ్యాను టీ20 సారథిగా ఎంపిక చేయాలని వ్యూహాలు రచిస్తోంది. రివ్యూ మీటింగ్లో ఈ అంశంపై కూడా చర్చిస్తామని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. రివ్యూ మీటింగ్ అనంతరం వేర్వేరు కెప్టెన్ల విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం..
టీ20 ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన టీమిండియా.. కొత్త సెలెక్టర్లకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నొటిఫికేషన్ గడువు ముగియగా.. వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)ని ఎంపిక చేసిన బీసీసీఐ.. కొత్త సెలెక్షన్ కమిటీని ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బీసీసీఐ రివ్యూ మీటింగ్ అనంతరం కొత్త సెలెక్షన్ కమిటీ ఎంపిక గురించి కూడా తెలియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications