న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోయినా బీసీసీఐ మాత్రం ఆటగాళ్ల జీతాల్లో కోత విధించలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలోని క్రికెటర్లకు ఈ త్రైమాసికానికి సంబంధించిన బకాయిలను బీసీసీఐ పూర్తిగా చెల్లించింది. ప్రస్తుత అనిశ్చితిలో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐకి చెందిన ఓ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు.
'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలోని ఆటగాళ్లకు త్రైమాసిక చెల్లింపులను బీసీసీఐ పూర్తిగా చెల్లించింది. భారత్, భారత్-ఏ తరఫున ఆడిన వారి మ్యాచ్ ఫీజులను కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే ఇచ్చేసింది" అని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ కారణంగా క్రికెట్ నిలిచిపోవడంతో తమ వేతనాల్లో కోత ఉండే అవకాశం ఉందని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటు భారత క్రికెటర్ల జీతాల్లో కూడా కోత పడుతుందనే ప్రచారం జరిగినా.. బీసీసీఐ మాత్రం పూర్తి బకాయిలను చెల్లించింది.
అయ్యో ధోనీ.. ఈ కష్టాలు నీకు తప్పలేదా?
ఇక మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జరిగే అవకాశం లేదని సదరు బీసీసీఐ అధికారి అంగీకరించారు. టోర్నీ పూర్తిగా రద్దయితే భారీ నష్టం ఉంటుందన్నాడు. అయినా ఐపీఎల్ నిర్వహణ గందరగోళం నెలకొందన్నాడు. సెప్టెంబర్లో నిర్వహిద్దామంటే.. ఆసియా కప్, ఇంగ్లండ్తో సిరీస్లు అడ్డు రానున్నాయని, అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ ఉందన్నాడు. పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియనప్పుడు ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేమన్నాడు.
అంతేకాకుండా డొమెస్టిక్ షెడ్యూల్తో కూడా బీసీసీఐకి చిక్కురానుంది. నిబంధనల ప్రకారం ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఎలాంటి డొమెస్టిక్ ఈవెంట్స్ క్లాష్ కావద్దు. ఒకవేళ ఐపీఎల్ నవంబర్, అక్టోబర్లో నిర్వహిస్తే.. డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్ మార్చాల్సి ఉంటుంది.