ముంబై: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 సీజన్ను యూఏఈ వేదికగా నిర్వహించుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో లిఖిత పూర్వకంగా అనుమతి రానుంది. ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో ఫ్రాంచైజీలు మిగతా పనుల్లో నిమగ్నమయ్యాయి. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, సిబ్బందిని క్వారంటైన్కు పంపించేందుకు సమాయత్తం అవుతున్నాయి.
'దుబాయ్లో ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించించింది. అనుమతి పత్రాలు ఎప్పుడైనా రావొచ్చు'అని ఓ బీసీసీఐ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపాడు.
బీసీసీఐ ఆదేశాల మేరకు మెజార్టీ ఫ్రాంచైజీలు ఆగస్టు 20 తర్వాతే దుబాయ్కు బయల్దేరనున్నాయి. చెన్నై సూపర్కింగ్స్ టీమ్ 22న వెళ్లనుందని తెలుస్తుండగా... ముంబై ఇండియన్స్ తన సొంత క్యాంప్లోనే భారత ఆటగాళ్లను క్వారంటైన్ చేస్తోంది. మరికొన్ని జట్లేమో తమ సొంత నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల్లో కరోనా పరీక్షలు చేయించి యూఏఈకి తీసుకెళ్లనున్నాయి.
దుబాయ్కు వెళ్లే ముందు 24 గంటల వ్యవధిలో రెండు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలని ఎస్ఓపీలో బీసీసీఐ సూచించగా.. ఫ్రాంచైజీలు నాలుగు వరకు చేస్తామని తెలిపాయి. కఠిన నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ బయో బబుల్ దాటకుండా ఉంటే కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తామని కొన్ని ఫ్రాంచైజీలు అంటున్నాయి. అయితే భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు వద్దని కొందరు ఆటగాళ్లు చెబుతున్నారని తెలిసింది. చిన్నారులతో కష్టమని వారు భావిస్తున్నట్టు సమాచారం.
చాలా ఫ్రాంచైజీలు యూఏఈ హోటళ్లలో ఉంటే ప్రమాదమని భావించి రిసార్టులు, అపార్టుమెంట్లు బుక్ చేస్తున్నాయి. వంటవాళ్ల నుంచి అన్ని పనులకు అవసరమైన సిబ్బందిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో జట్టుకు 24 మంది ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. సిబ్బంది సంఖ్యపై పరిమితి విధించలేదు. ఇతర అవసరాలు, వైద్య సిబ్బంది సహా మొత్తం కలిపి ఒక్కో ఫ్రాంచైజీ నుంచి 60 మంది వరకు ఉంటారని తెలుస్తోంది.
పశ్చాత్తాపపడేది ఏదైనా ఉందంటే.. గంగూలీ రిటైర్మెంట్ తర్వాత అవకాశం రావడమే: యువరాజ్ సింగ్