ఫస్ట్ మ్యాచ్ ఎవరిదంటే..?
చెన్నైవేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ సీజన్కు తెరలేవనుంది. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం వేదికగా.. ప్లే ఆఫ్ మ్యాచ్లతో పాటు మే 30న ఫైనల్ జరగనుంది. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ , అహ్మదాబాద్లను ఐపీఎల్కు వేదికలుగా ఎంపికచేశారు. అహ్మదాబాద్, ఢిల్లీలో 8, మిగిలిన నాలుగు వేదికల్లో 10 మ్యాచ్లు జరగనున్నాయి.
11న సన్రైజర్స్ ఫస్ట్ మ్యాచ్..
ఏప్రిల్ 11న కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఏప్రిల్ 10న ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ను మొదలుపెట్టనుంది. ఈ సీజన్కు పేరు మార్చుకొని కొత్తగా బరిలోకి దిగుతున్న పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు ఫ్రాంచైజీలకు హోమ్ అడ్వాంటేజ్ కలిసిరానుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్కు హోం గ్రౌండ్ లేకుండా పోయింది.
అభ్యర్థనలు బేఖాతరు..
హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ఐపీఎల్ గవర్నింగ్స్ కౌన్సిల్తో పాటు బీసీసీఐని రెండు రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కావాల్సిన మద్దతునిస్తామని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్లో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం కఠిన చర్యటు తీసుకుంటుందని కూడా పేర్కొన్నాడు. ఇక మొహాలీ వేదికగా నిర్వహించాలని పంజాబ్ ముఖ్యమంతి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా బీసీసీఐని కోరాడు. కానీ ఇవన్నీటిని ఐపీఎల్ జీసీ, బీసీసీఐ బేఖాతరు చేసింది.
ముంబైలో ఎందుకు?
ఇక కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ముంబై నగరంలో ఐపీఎల్ 2021 నిర్వహించాల్సిన అవసరం ఏముందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతిండియాలో చెన్నై, బెంగళూరులో నిర్వహించి పక్కనే ఉన్న హైదరాబాద్ను పట్టించుకోకపోవడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. ఏ ఫ్రాంఛైజీ లేని అహ్మదాబాద్ ఎందుకని కూడా నిలదీస్తున్నారు. ఏదీ ఏమైనా ఐపీఎల్ తాజా షెడ్యూల్తో ఐదు ఫ్రాంచైజీల అభిమానులు సంతోషంగా ఉండగా.. మరో మూడు ఫ్రాంచైజీల ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారు.