India vs Australia: అయిపాయే.. కోహ్లీసేన వన్డే సిరీస్ కోల్పోయే!

సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సుదీర్ఘ పర్యటనలో ఫస్ట్ వన్డే సిరీస్నే కోహ్లీసేన 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించినా.. చెత్త ఫీల్డింగ్.. పసలేని బౌలింగ్తో వరుసగా రెండు వన్డేల్లో ఓటమిపాలైంది. మరోవైపు సూపర్ బ్యాటింగ్.. కళ్లు చెదిరే ఫీల్డింగ్.. పొదుపైన బౌలింగ్తో చెలరేగిన ఆసీస్ బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చావో రేవో వన్డేలో కోహ్లీ సేన 51 పరుగులతో పరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76) పోరాడినా ఫలితం లేకపోయింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు) మరోసారి మెరుపు సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), ఆరోన్ ఫించ్ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు) , గ్లెన్ మ్యాక్స్వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) పరుగుల విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బ్యాట్స్మెన్ ధాటికి భారత బౌలర్లు మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా (1/79), షమీ (1/73), చహల్ (0/71), సైనీ (0/70), జడేజా(0/60) దారుణంగా విఫలమయ్యారు. పాండ్యా(1/24) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. అనంతరం భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకే పరిమితమైంది.

శుభారంభం లేదు..
390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్(30), మయాంక్ అగర్వాల్(28) మంచి శుభారంభాన్ని అందించలేకపోయారు. భారత ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించినా.. ఆ జోరును కొనసాగించలేకపోయారు. అనవసర షాట్లకు ప్రయత్నించి వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. హజల్వుడ్ బౌలింగ్లో ధావన్, కమిన్స్ ఓవర్లో మయాంక్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మంచి బంతులను గౌరవిస్తూ ఓపికగా ఆడారు.

స్మిత్ సూపర్ క్యాచ్..
వీలుచిక్కిన బంతలను ఈ జోడీ బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలోనే జంపా వేసిన 23వ ఓవర్ నాలుగో బంతిని లెగ్ సైడ్ ఫోర్ కొట్టిన కోహ్లీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన మునపటి లయను అందుకున్నాడు. కానీ భారత అభిమానులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. స్మిత్ సూపర్ డైవ్ క్యాచ్కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్(38) వెనుదిరిగాడు. హెన్రీక్స్ బౌలింగ్లో అయ్యర్ మిడివికెట్ మీదుగా షాట్ ఆడగా.. ఆ దిశలో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్తో బంతిని అందుకున్నాడు. రెప్పపాటు సమయంలో అచ్చం పక్షిలా ఎగిరి వెనక్కి డైవ్ చేస్తూ బంతిని అతను అందుకున్న తీరు ఔరా అనిపించింది. దాంతో మూడో వికెట్కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

రాహుల్- కోహ్లీ..
ఇక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్తో కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వికెట్ పడినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జోరుగా బ్యాటింగ్ చేశాడు. కానీ అదే జోరులో హెన్రీక్స్ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఫస్ట్ వన్డే మాదిరే హజల్ వుడ్ వేసిన బ్యాక్ ఫుట్ లెంగ్త్ను కోహ్లీ మిడ్ వికెట్ మీదుగా ఆడగా.. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీక్స్ ఎడమవైపు సూపర్ డైవ్ చేసి చాకచక్యంగా అందుకున్నాడు. దాంతో సెంచరీ దిశగా దూసుకెళ్లిన కోహ్లీ ఇన్నింగ్స్కు బ్రేక్ పడింది. ఆ తర్వాత పాండ్యాతో కలిసి రాహుల్ ధాటిగా ఆడాడు.
కమిన్స్ వేసిన 39వ ఓవర్ ఆఖరి బంతిని సిక్స్గా మలచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ధాటిగా ఆడాలనే తొందరలో వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత జడేజా(24), పాండ్యా(28) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి వరుస బంతుల్లో ఔటయ్యారు. దాంతో భారత్ పోరాటం ముగిసింది. చివర్లో షమీ, బుమ్రా కూడా ఔటవ్వగా.. సైనీ, చహల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
India vs Australia: వారెవ్వా స్మిత్.. వాటే క్యాచ్.. అచ్చం పక్షిలా పట్టేశావ్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications