న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తమ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతారని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్కు చెందిన ఫార్చ్యూన్ రైస్బ్రాన్ ఆయిల్కు దాదా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఫార్చ్యూన్ ఆయిల్ను వాడాలని ఆ ప్రకటనలో గంగూలీ చెబుతుంటారు. అయితే గత శనివారం దాదా గుండెపోటుకు గురవ్వడంతో ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ యాడ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫార్చ్యూన్ ఆయిల్ తింటే గుండె జబ్బు వస్తుందని, బ్రాండ్ అంబాసిడర్కే వచ్చిందని కామెంట్ చేశారు. దాంతో ఆదానీ విల్మార్ కంపెనీ ఈ ప్రకటనను నిలిపివేసింది. అయితే ఇది తాత్కలిక విరామమేనని ఆదానీ విల్మార్ డిప్యూటీ సీఈవో అంగ్షు మల్లిక్ స్పష్టం చేశారు.
'మా ఫార్చ్యూన్ రైస్బ్రాన్ ఆయిల్ ప్రచారకర్తగా గంగూలీనే కొనసాగుతారు. రైస్బ్రాన్ ఆయిల్ ఔషధం కాదు వంట నూనె మాత్రమే. ఆహార, వంశపారంపర్య సమస్యలతో సహా అనేక అంశాలు గుండె జబ్బులకు కారణమవుతాయి. మేం గంగూలీతో కలిసి పనిచేయడం కొనసాగిస్తాం. మేం మళ్లీ దాదాతో చర్చించి నిర్ణయం తీసుకునే వరకు మా టీవీ వాణిజ్య ప్రకటనకు తాత్కాలిక విరామం మాత్రమే ఇస్తున్నాం' అని మల్లిక్ పేర్కొన్నారు.
ఇంట్లో ట్రేడ్మిల్ చేస్తుండగా హార్ట్ ఎటాక్కు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ శనివారం స్థానిక వుడ్ల్యాండ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాదా హార్ట్లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేశారు. దాంతో దాదాకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగానే ఉందని బుధవారం డిశ్చార్జి చేయనున్నట్లు సోమవారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాదా గుండె ప్రస్తుతం బాగానే ఉందని, అతను మాములు రోజుల్లోలానే పనులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాకపోతే దాదా గుండెలో మిగిలిపోయిన రెండు బ్లాక్స్ను మెడికేషన్, యాంజీప్లాస్టీ ద్వారా పూడ్చుకోవచ్చని, అది గంగూలీ ఇష్టమని పేర్కొంది. భారత ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి కూడా దాదాను పరీక్షించి అంతా బాగుందని తెలిపారు.