దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్కు మరో మూడు రోజుల్లో తెరలేవనుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. జట్టుకు అవసరమైతే పార్ట్ టైమ్ బౌలర్గా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని కోహ్లీకి విన్నవించాడు. రెండు రోజుల క్రితమే తన కోరికను విరాట్ ముందుంచానని అతనే స్వయంగా ఆర్సీబీ'బోల్డ్ డైరీస్'ఎపిసోడ్లో వెల్లండించాడు.
'నాతో కూడా బౌలింగ్ చేయించాలని కోహ్లీతో ఎప్పుడూ సరదాగా అంటుంటా. అయితే రెండు రోజుల క్రితం మాత్రం నాతో బౌలింగ్ చేయించాలనుకుంటే దానికి సిద్దంగా ఉన్నానని విరాట్కు చెప్పా. నేను గొప్ప బౌలర్ని కాదు. కానీ భిన్నమైన వ్యూహాలతో ఫలితాలు రాబట్టడాన్ని ఇష్టపడుతా'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల బెంగళూరు టీమ్ ప్రాక్టీస్ సెషన్లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసిన ఏబీ డివిలియర్స్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో కొంత కాలం కీపర్గా సేవలందించాడు. వన్డే, టెస్టుల్లో అప్పుడప్పుడు బౌలింగ్ చేసేవాడు. కానీ.. టీ20ల్లో మాత్రం ఏబీడీ ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. గంటకి 120కిమీ వేగంతో డివిలియర్స్ బంతిని విసరగలడు. ఈ సీజన్ యూఏఈ వేదికగా జరుగుతుండటంతో ఆటగాళ్లకు వాతావరణంతో పెద్ద సవాల్ ఎదురుకానుందన్నాడు. అక్కడ ఉండే వేడిలో ఆడుతూ ఆటగాళ్లు తమ శక్తిని కాపోడుకోవడం సవాల్తో కూడుకున్నదని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆడింది చాలా తక్కువని, ఒకసారి చెన్నైలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నాడు.
'ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆడటం చాలా తక్కువ. ఇక్కడి వేడి చెన్నైలో ఆడిన ఓ మ్యాచ్ను గుర్తు చేస్తుంది. జులైలో భారత్తో జరిగిన నాటి టెస్ట్లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేశాడు. అప్పుడు మైదానంలో పరిస్థితి ఇలానే ఉంది. ఇంకా చెప్పాలంటే అదే కొంచెం నయం. ఈ వేడి ఆటపై ప్రభావం చూపనుంది. ఇన్నింగ్స్ అయిపోయేవరకు ఆటగాళ్లు శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం'అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబరు 21న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తొలి మ్యాచ్తో బెంగళూరు ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించనుంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది బెంగళూరు టీమ్ మంచి సమతూకంతో కనిపిస్తోంది.