దుబాయ్: పునరాగమనంలో జోరుమీదున్న భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా దుబాయ్ ఓపెన్లో శుభారంభం చేసింది. కాలి పిక్క గాయం నుంచి తేరుకున్న సానియా ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియాతో కలిసి డబుల్స్లో ప్రీక్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం 6-4, 4-6, 10-8తో 'సూపర్ టైబ్రేక్'లో అలా కుద్రయెత్సెవా (రష్యా)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటను ఓడించింది.
78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా జంట ఐదు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయ్సాయ్ జెంగ్ (చైనా)-బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా-గార్సియా జంట ఆడుతుంది.
2017 అక్టోబర్లో చైనా ఓపెన్ ఆడిన సానియా.. ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచ్చింది. ఇక 2018 అక్టోబర్లో మగబిడ్డ ఇజాన్కు జన్మనివ్వడంతో రెండేళ్లు ఆటకు దూరమైన సానియా.. రీ ఎంట్రీలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గి సత్తాచాటింది.
ఈ టోర్నీ అనంతరం ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్క గాయంతో అర్థాంతరంగా తప్పుకుంది. అనంతరం రెండు వారాల్లోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుబాయ్ ఓపెన్ బరిలోకి దిగింది. ఈ టోర్నీకి ముందు సానియా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ఓపెన్లో గాయంతో వెనుదిరగడం ఎంతో బాధించిందని తెలిపింది.
'ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బాధించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇలా జరగడం బాధే. తిరిగి ఫిట్నెస్ సాధించడంలో డాక్టర్ హయత్ ఖాన్ ఎంతో సహాయం చేసారు. ఇప్పటికే నేను ప్రాక్టీస్ మొదలెట్టాను. దుబాయ్ ఓపెన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తా' అని సానియా చెప్పుకొచ్చింది.