హైదరాబాద్: యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టాప్ ప్లేయర్లు అందరూ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. స్విస్ దిగ్గజం, ఐదు సార్లు యుఎస్ ఓపెన్ విజేత అయిన రోజర్ ఫెదరర్ 6-2, 6-2, 6-4తో జపాన్కు చెందిన యోషిహితో నిషిఒకాపై విజయం సాధించగా, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7-5, 6-1, 1-1తో ఆధిక్యంలో ఉన్న దశలో మారియస్ కొపిల్ (రొమేనియా) వైదొలిగాడు.
నాలుగో సీడ్ జ్వెరెవ్ 6-2, 6-1, 6-2తో పోలాన్స్కీని, కిర్గియోస్ 7-5, 2-6, 6-4, 6-2తో అల్బాట్ను, ఫాగ్నిని 4-6, 6-2, 6-4, 7-6 (7-4)తో మోహ్ను ఓడించగా.... ఆరో సీడ్ నొవాక్ జొకోవిచ్ 6-3, 3-6, 6-4, 6-0తో ఫుక్సోవిచ్స్పై విజయం సాధించాడు. ఫుక్సోవిచ్స్తో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ మాత్రం యుఎస్ ఓపెన్లో ఎండతో విలవిల్లాడాడు.
దీంతో మ్యాచ్ మధ్యలో ఐస్బాత్ను ఆస్వాదించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం మార్టన్ ఫక్సోవిక్స్ (హంగేరి)తో జరిగిన తొలి రౌండ్ ఆట మధ్యలో అతనితో కలిసి జకోవిచ్ ఐస్బాత్ చేశాడు. రెండు సెట్లయ్యాక చివరకు జొకో, అతని ప్రత్యర్థి మార్టన్ ఫుక్సోవిక్స్ (హంగేరి) మాకో పది నిమిషాల విశ్రాంతి కావాల్సిందేనంటూ కోర్టు బయటికొచ్చారు.
అప్పుడు ఇద్దరు చెరో సెట్ గెలిచి ఉన్నారు. కోర్టు పక్కనే జొకోవిచ్, ఫుక్సోవిక్స్ చొక్కాలిప్పి ఐస్బాత్తో సేదతీరాకే మళ్లీ రాకెట్ పట్టారు. గ్రాండ్స్లామ్ ఈవెంట్ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ మధ్యలో 10 నిమిషాల బ్రేక్ను తీసుకున్నారు. వేడిమి ఎక్కువ ఉండటంతో నిర్వాహకులు ఇలా అనుమతినిచ్చారు.
మ్యాచ్ అనంతరం 10 నిమిషాల బ్రేక్ ఇచ్చిన యూఎస్ ఓపెన్ నిర్వాహకులకు జకోవిచ్ ధన్యవాదాలు తెలిపాడు. విశ్రాంతి ఇద్దరి ఆటగాళ్లకు అవసరేమనని, ఐస్బాత్తో అద్భుత భావన పొందినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఐస్బాత్తోనే కోర్టులో రాణించగలిగామని తెలిపాడు.
మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ విక్టోరియా అజరెంకా యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్లో జోరు కొనసాగిస్తోంది. బుధవారం ఆమె రెండో రౌండ్లో 6-1, 6-2తో గవ్రిలోవాపై ఘనవిజయం సాధించింది. రెండో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-3, 6-2తో స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా, నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-6 (7/5), 6-3తో గాస్పర్యాన్ (రష్యా)ను ఓడించింది.
మరో వైపు భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఆట తొలిరౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 96వ ర్యాంకర్ యూకీ 3-6, 6-7 (3/7), 5-7తో పీర్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.