న్యూయార్క్: జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతుంది. ఇప్పుడు ఈ సెగ అమెరికా టెన్నిస్ అసోసియేషన్(ఏటీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న సిన్సినాటి మాస్టర్స్(వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్)కు తగిలింది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్లో సెమీ ఫైనల్కు చేరిన నాలుగో సీడ్, జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాక పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీంతో టోర్నీ ఓ రోజు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఒక రోజు టోర్నీని నిలిపివేస్తున్నామని డబ్ల్యూటీఏ, యూఎస్టీఏ, ఏటీపీలు ప్రకటించాయి. ఇటీవల జాకబ్ బ్లేక్ అనే నల్లజాతీయుడిపై అమెరికా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అమెరికాలో పెద్ద ఎత్తు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాల్పుల ఘటనపై బాస్కెట్బాల్, బేస్ బాల్, సాకర్ ప్రొఫెషనల్ అథ్లెట్లు నిరసన వ్యక్తం చేశారు. వీరి బాటలోనే నడిచిన ఓసాకా.. నల్లజాతి మహిళగా జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా టోర్నీ నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు ట్వీట్ చేసింది.
'హలో.. మీలో చాలా మందికి రేపు(గురువారం) నా సెమీఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ గురించి తెలిసే ఉంటుంది. అయితే అథ్లెట్కు ముందు నేనో నల్లజాతి మహిళను. నేను టెన్నిస్ ఆడటం కన్నా ఓ నల్లజాతి మహిళగా దృష్టిసారించిన అంశాలు చాలా ఉన్నాయి. నేను ఆడకపోవడం వల్ల కొంపలు మునిగే నష్టం ఏంలేదనుకుంటున్నా. కానీ శ్వేతజాతి ఆటగాళ్లతో మాట్లాడటం ప్రారంభిస్తే.. నేను ఎంచుకున్న దారి సరైందే. వరుసగా నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇలా వరుస ఘటనలతో రోజుల వ్యవధిలోనే కొత్త హ్యాష్ ట్యాగ్లు పాపప్ అవ్వడంతో విసిగిపోయాను. పదేపదే దీనిపై మాట్లాడటం కూడా నాకు చిరాకు తెప్పిస్తుంది. దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారో..?'అని ఓసాక అసహనం వ్యక్తం చేసింది.
బుధవారం జరిగిన క్వార్ట్సర్స్ మ్యాచ్లో నాలుగో సీడ్ ఓసాక 4-6, 6-2, 7-5తో 12వ ర్యాంకర్ అనెట్ కొంటావీట్ను ఓడించింది. ఈ గెలుపుతో టాప్-10 ప్లేయర్లలో సెమీఫైనల్కు చేరిన ఏకైక ప్లేయర్గా ఓసాక గుర్తింపు పొందింది. సెమీఫైనల్లో 14వ ర్యాంకర్ ఎలిసే మెర్నెట్స్తో ఓసాక తలపడాల్సింది. కానీ నల్లజాతీయులపై జరుగుతున్న కాల్పులకు నిరసనగా టోర్నీ నుంచి తప్పుకుంది.
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) August 27, 2020